కోడికత్తి కేసులో గత ఐదేళ్ళుగా జైలులో రిమాండ్ ఖైదీగా మగ్గుతున్న దళిత యువకుడు జనిపల్లి శ్రీనివాస్కు రాష్ట్ర హైకోర్టు నేడు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.25వేల విలువగల రెండు పూచీకత్తులు, ప్రతీ ఆదివారం ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో హాజరయ్యి సంతకం చేయాలని ఆదేశించింది. ఈ కేసు గురించి మీడియా లేదా మరెవరితో మాట్లాడరాదని షరతు విధించింది.
2018, అక్టోబరులో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు, విమానాశ్రయం క్యాంటీన్లో పనిచేస్తున్న జనిపల్లి శ్రీనివాస్ కోడికత్తితో దాడి చేశాడు. కానీ జగన్ తృటిలో తప్పించుకొన్నారు. ఆ దాడిలో జగన్ భుజానికి చిన్న గాయం అయ్యింది. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. శ్రీను జైలులో మగ్గుతూనే ఉన్నాడు.
జగన్ ఈ కేసు విచారణకు హాజరు కాకుండా ఉద్దేశ్యపూర్వకంగా ఈ కేసుని పొడిగించే ప్రయత్నం చేస్తున్నారని, దాని వలన నిందితుడు శ్రీను 5 ఏళ్ళుగా జైలులో మగ్గుతున్నాడని, అతని తరపు న్యాయవాది అభిప్రాయంతో హైకోర్టు ధర్మాసనం ఏకీభవిస్తూ, శ్రీనుకి నేడు బెయిల్ మంజూరు చేసింది.
గత ఎన్నికలలో వివేకా హత్య, ఈ కోడికత్తి కేసు రెంటినీ తెలివిగా వాడుకుని వైసీపి లభ్ది పొందింది. జగన్ ఏ ఉద్దేశ్యంతో ఈ కోడికత్తి కేసుని ఇంతకాలం సాగదీయించినప్పటికీ, అదే పెద్ద పొరపాటు అని నిరూపితం కాబోతోంది. దళిత యువకుడు సుబ్రహ్మణ్యంను అతికిరాతకంగా హత్య చేసి అతని శవాన్ని డోర్ డెలివరీ చేసిన వైసీపి ఎమ్మెల్సీ అనంత బాబుకి ఆర్నెల్లో బెయిల్పై బయటకు వచ్చేశాడు.
కానీ నిరుపేద దళితుడైన శ్రీనుపై ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ పగబట్టిన్నట్లు వ్యవహరిస్తూ 5 ఏళ్ళు జైలులో నుంచి రానీయకుండా చేసినందుకు రాష్ట్రంలో దళితులు ఆగ్రహంగా ఉన్నారు. సరిగ్గా ఎన్నికలకు ముందు శ్రీనుకి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో, అతను నిర్ధోషి అని చెప్పకనే చెప్పిన్నట్లయింది కూడా. ప్రతిపక్షాలు, మీడియా ఈ విషయాన్ని ఎన్నికలలో హైలైట్ చేయక మానవు. కనుక గత ఎన్నికలలో వైసీపికి నష్టం కలిగించబోతోంది. గత ఎన్నికలలో వైసీపికి సాయపడిన కోడికత్తి ఈసారి ఎన్నికలలో నిజంగానే గుచ్చుకోబోతుండటం దేవుడి స్క్రిప్టే కదా?




