వైసీపీ అధినేత జగన్ చేస్తున్నవి తప్పులని తెలుసున్నా ఆ పార్టీ నేతలకు వేరే డోర్స్ లేవు కనుక తానతందాన అనక తప్పదు. ఆ ప్రకారమే అందరూ కలిసి అమరావతిపై విషం కక్కారు.
కానీ జగన్ తన ‘ప్లాన్-బి: మావిగన్’ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం వారికి చెప్పకుండా దాచి పెట్టి ప్రెస్మీట్లో బయట పెట్టారు. అంటే వారిని జగన్ నమ్మడం లేదా ముందే చెప్తే వారిలో ఎవరో ఒకరు ధైర్యం వద్దని అడ్డుపడతారనా లేదా ‘మావిగన్ క్రెడిట్’ మొత్తం తనకే దక్కాలని జగన్ అనుకున్నారా?
జగన్ మూడు రాజదానులన్నప్పుడు వైసీపీ నేతలు ‘ఆహా ఓహో ఎంత గొప్ప ఆలోచన?’ అంటూ పొగిడారు. ‘విశాఖ రాజధాని’ అన్నప్పుడు ‘ఆహా జగన్.. ఓహో జగన్..’ అంటూ పొగిడారు.
కానీ ఓ పక్క అమరావతి బిల్లుకి పార్లమెంటు ఆమోదముద్ర వేస్తున్న సమయంలోనే జగన్ ‘మావిగన్’ అనడంతో ‘ఆహా ఓహో’ అనలేక తలలు పట్టుకుంటున్నారు.
విశాఖ రాజధాని అయితేనే ఉత్తరాంద్ర జిల్లాలు అభివృద్ధి చెందుతాయి. లేకుంటే లేదని బొత్స, గుడివాడ, ధర్మాన, సీదిరి వంటి నేతలు ఊదరగొట్టారు. ఇప్పుడు జగన్ స్వయంగా విశాఖని అటకెక్కించేసి కొత్తగా ‘మావిగన్’ అనడంతో వారు ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పుకోగలరు?
జగన్ ఏ రాజధాని కట్టాల్సిన అవసరమే లేదు. కానీ కనీసం విశాఖ రాజధాని అనే మాటపై కూడా నిలబడలేరా? జగన్ ఇలా రోజుకో మాట మార్చుతుంటే వైసీపీ నేతల పరిస్థితి ఏమిటి? నిత్యం ప్రజల మద్య ఉండే వైసీపీ కార్యకర్తలు తలెత్తుకోగలరా? అని ఆలోచించినట్లు లేదు.
జగన్ కోటరీలో సజ్జల వంటి మేధావులలో ఎవరు ఆయనకు ఈ ప్లాన్-బి: మావిగన్ సలహా ఇచ్చారో కానీ జగన్ చేతనే వైసీపీ కళ్ళను పొడిపించారని చెప్పక తప్పదు. కనుక కూటమి నేతలు వైసీపీలో ఆ శల్య మహాశయుడికి తప్పక ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందే.




