వైసీపీ ఓటమి నాటి నుంచి నేటి వరకు జగన్ ఆ అవమాన భారానికి గంతలు కట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా ఒకసారి ఈవీఎం ల ట్యాపరింగ్ అంటూ హంగామా చేస్తుంటే మరోసారి అలవు కానీ హామీల ఫలితమే అంటూ హడావుడి చేస్తున్నారు.
అయితే ఇప్పటికి వైసీపీ కి తన అపజయానికి గల కారణాలేంటో తెలియకుండా జగన్ ఆ పార్టీ కళ్ళు మూసే ఉంచారు. గత ఐదేళ్లు తమ అవినీతికి, అరాచకాలకు, అక్రమాలకు ఈ 11 సాక్ష్యం అనేది జగన్ కు ఎరుకే. కానీ ఆ నిజాన్ని గ్రహించేందుకు వీలు లేకుండా పార్టీ క్యాడర్ నుంచి లీడర్ల వరకు జగన్ వారి కళ్ళకు గంతలు తొడిగారు.
మరో మూడేళ్లు కళ్ళు మూసుకోండి, కాలం యిట్టె గడిచిపోతుంది, తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుంది, అప్పుడు ఒక్కొక్కరికి రప్ప రప్పనే అంటూ ఇప్పటికి వైసీపీ నాయకులకు అసలు క్షేత్ర స్థాయి వాస్తవాలు తెలియనివ్వకుండా తన రాజకీయ లబ్ది కోసం జగన్ వైసీపీ కళ్ళు మూసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు.
రానున్న మూడేళ్లే కాదు గడిచిపోయిన ఐదేళ్లు కూడా జగన్ ఆ పార్టీ సిబ్బందికి కళ్ళు మూసే ఉంచారు. పరదాలతో మొదలైన జగన్ గంతలు ఒక్కో స్థాయిలో ఒక్కో మాదిరి వైసీపీ కళ్ళు మూసాయి. కొడాలి నాని బూతులతో తెగబడుతుంటే అది పార్టీకి ఎంత డామేజ్ చేస్తుందో తెలుసుకోకుండా జగన్ కళ్ళుమూసుకుని పాలన చేసారు.
అలాగే అసెంబ్లీ సాక్షిగా వైసీపీ నేతలు మహిళ పై చేసిన నీచమైన విమర్శలు ఆ పార్టీని ఏ స్థాయికి దిగజార్చాయి చూడకుండా జగన్ కళ్ళు మూసుకుని ప్రభుత్వాన్ని నడిపారు. టీడీపీ కార్యాలయంపై మీద దాడులు, జనసేన శ్రేణుల మీద దౌర్జన్యాలు వైసీపీ ని ప్రజలలో ఎంత పలుచన చేస్తున్నాయో జగన్ చూడలేకపోయారు.
బాబు అరెస్టు నుంచి పవన్ నిర్బంధం వరకు ఏపీలో ప్రస్తుతం ఎం జరుగుతుంది.? దాని పర్యవసానాలతో భవిష్యత్ లో ఎం జరగబోతుంది అన్న ఆలోచన కానీ ముందు చూపు కానీ లేకుండా జగన్ తన పైశాచిక ఆనందం కోసం తానూ కళ్ళు మూసుకుని, వైసీపీ శ్రేణుల కళ్ళకు గంతలు కట్టి మరి కక్ష్య రాజకీయాలకు పాల్పడ్డారు.
అమరావతి రైతుల నిరశన, వారి కుటుంబాల కన్నీటి ఉసురు వైసీపీ రెక్కలు విరవబోతున్నాయి అనే వాస్తవాన్ని జగన్ నాడు గుర్తించలేదు, నేటికీ గ్రహించడం లేదు. శ్రీరెడ్డి చెండాలం, బోరుగడ్డ దుర్మార్గం, పోసాని దుస్సాహసం, రామ్ గోపాల్ వర్మ వెకిలి చేష్టలు, వర్రా రవీంద్రా రెడ్డి, భార్గవ్ రెడ్డిల పైశాచిక ఆనందం వైసీపీని పాతాళానికి నెడుతున్నా జగన్ కళ్ళు మూసుకునే ఉన్నారు.
కొడాలి బూతు పురాణాలు, వంశీ దిగజారుడు వ్యాఖ్యలు, రోజా, అంబటి, ద్వారం పూడి, పేర్ని నాని, గుడివాడ అమర్నాధ్, జోగి రమేష్, అనిల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి, సాయి రెడ్డి, సజ్జల, పెద్ది రెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, అవినాష్…ఇలా వైసీపీ నేతలందరూ హద్దులు దాటిన రాజకీయంతో చెలరేగుతూ వైసీపీ ఇమేజ్ ను భూస్థాపితం చేస్తున్నా జగన్ గత ఐదేళ్లు కళ్ళుతెరవలేదు.
మూయాల్సిన నోటిని మూయకుండా కళ్ళు మూసుకోండి అంటూ జగన్ గత ఐదేళ్లు కూడా ఐప్యాక్ రాజకీయాలతో, సిద్ధం సభలతో, గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్ తో తానూ కళ్ళు మూసుకుంటమే కాదు తన పార్టీ నేతల నుంచి పార్టీ కార్యర్తల వరకు వై నాట్ 175 నినాదంతో అందరి కళ్ళు మూసేసారు జగన్. దాని ఫలితమే నేడు వైసీపీ 11 కి పరిమితం కావాల్సి వచ్చింది.
జగన్ చెపుతున్నట్టు మరోమూడేళ్లు కళ్ళు మూసుకుంటే గత ఐదేళ్లు చేసిన పాపాలకు పరిహారం జరిగిపోతుందా.? ఇప్పటికైనా జగన్ కళ్ళు తెరిచి తన విధానాలతో పార్టీకి జరిగే నష్టమేమిటి.? తన పార్టీ నాయకుల చర్యలతో వైసీపీ ముందున్న ముప్పేమిటి.? వైసీపీ క్యాడర్ అత్యుత్సహం తో వైసీపీ ఎదుర్కుంటున్న విమర్శలేమిటి.? అనే వాటి మీద క్షేత్ర స్థాయి రిపోర్ట్స్ పరిశీలించాలి. అవి వైసీపీ ని ప్రజలకు దూరం చేస్తున్నాయి అనే వాస్తవాన్ని గుర్తించాలి.
కానీ ఇప్పటికి పేర్ని నాని మాటలకు, ప్రస్సన్న వ్యాఖ్యలకు, అంబటి చర్యలకు, రోజా చేష్టలకు, కార్యకర్తల అత్యుత్సహానికి, నాయకుల దిగజారుడుతనానికి తన మద్దతు ప్రకటిస్తూ వచ్చేది మనమే, చూసుకుందాం అంటూ మరో మూడేళ్లు తన పార్టీ శ్రేణుల కళ్ళకు గంతలు కట్టేందుకు జగన్ మరోమారు సిద్ధమయ్యారు.ఈసారి కూడా వైసీపీ ఇదే ధోరణితో ముందుకెళితే ఆ 11 లో వైసీపీకి ఎన్ని మిగులుతాయో.?




