ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి గురించి ఆలోచిస్తూ, ఆ దిశలో ప్రజలు ఆలోచింపజేయాలని ప్రయత్నిస్తుంటే, మరోపక్క జగన్ “రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది.. శాంతి భద్రతలు క్షీణించాయి.. రాష్ట్రం సర్వ నాశనం అయిపోతోందని” ప్రజలను నమ్మించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
జగన్ మళ్ళీ ఎన్నటికీ అధికారంలోకి రారని నిర్భయంగా పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టండని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు అందరికీ నమ్మకం కల్పించేందుకు ప్రయత్నిస్తుంటే, జగన్ “మళ్ళీ నేను అధికారంలోకి రాబోతున్నానని, టీడీపీ నేతలపై ప్రతీకారం తీర్చుకుంటామని చాలా నమ్మకంగా, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు కంటే గట్టిగా చెపుతున్నారు.
సమాజం చెడుని స్వీకరించినంత త్వరగా మంచిని స్వీకరించదు. కనుక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి, దాని వలన కలిగే మంచి ఫలితాల గురించి ఆలోచించాల్సి ఉండగా, “జగన్ మళ్ళీ వస్తే?” అని ప్రజలు, ఉన్నతాధికారుల చేత ఆలోచింపజేస్తున్నారు.
జగన్ తాడేపల్లి ప్యాలస్లో నుంచి బయటకు రాకుండానే ప్రజలలో, ఉన్నతాధికారులలో భయం పుట్టించగలుగుతున్నారు. బయటకు వస్తే పోలీసులు కూడా భయపడేలా చేస్తున్నారు.
అనేక కేసులు మెడకు చుట్టుకున్న జగన్ భవిష్యత్ ఏవిదంగా ఉంటుందో ఎవరికీ తెలియదు. కానీ ప్రజలను, పెట్టుబడిదారులను, ముఖ్యంగా ఉన్నతాధికారులను ‘జగన్ మళ్ళీ వస్తే?’ అని ఆలోచింపజేయగలుగుతున్నారంటే జగన్ సగం విజయం సాధించినట్లే కదా? జగన్ యధాలాపంగా ఇటువంటి వాదనలు, రాజకీయాలు చేయడం లేదు. చాలా తెలివిగా మైండ్ గేమ్స్ ఆడుతున్నారని చెప్పవచ్చు.
మళ్ళీ నేను ముఖ్యమంత్రి కాబోతున్నానని జగన్ అంత నమ్మకంగా చెపుతుంటే కూటమి ప్రభుత్వంలో ఒకరిద్దరు తప్ప ఎవరూ ఖండించడం లేదు. ప్రజలు, అధికారులకు ధైర్యం చెప్పడం లేదు.
జగన్ చాలా తెలివిగా అమలుచేస్తున్న ఈ వ్యూహంతో కూటమికి రాజకీయంగా ఎంత నష్టం జరుగుతుందో ఎవరికీ అర్దమైనట్లు లేదు.
ఒకవేళ అర్దమయినా జగన్ సంగతి ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు చూసుకుంటారులే మనకెందుకు? అని అలసత్వం లేదా నిర్లిప్తంగా ఉంటున్నట్లు కనిపిస్తోంది.
కనుక కేవలం 10 మంది ఎమ్మెల్యేలతో తాడేపల్లి ప్యాలస్లో నుంచి అడుగు బయటపెట్టకుండా జగన్ ఏపీ రాజకీయాలను తనకు అనుకూలంగా మలుపు తిప్పుతుంటే కూటమి నేతలు ఎప్పుడు మేల్కొంటారో?




