జగన్ 5 ఏళ్ళ పాలనలో నిర్మించినవి ఏవైనా ఉన్నాయా అంటే అవి విశాఖలో రుషికొండపై రూ.500 కోట్ల ప్రజాధనంతో తన కోసం కట్టుకున్న విలాసవంతమైన భవనాలు మాత్రమే. మిగిలినవన్నీ గత ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టినవే నిర్మించినవే.
గత ప్రభుత్వం కట్టిన వాటిని కూల్చడం, మూసివేయించడం, వైసీపీ రంగులు వేయించడం, తన పేర్లు, ఫోటోలు పెట్టుకోవడం తప్ప 5 ఏళ్ళ పాలనలో జగన్ కొత్తగా కట్టింది ఒక్కటి కనపడదు. కనీసం రోడ్ల గుంతలు కూడా పూడ్చలేకపోయారు ఎందుకంటే వాటి కోసం ‘బటన్’ లేదు కనుక.
ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన అమరావతి, పోలవరం వంటి భారీ ప్రాజెక్టులను ఎలా మొదలుపెట్టాలో కూడా తెలీక రివర్స్ టెండరింగ్ పేరుతో బ్రేకులు వేసి జగన్ తప్పించుకున్నారు.
జగన్ అక్రమాస్తుల కేసులలో 16 నెలలు జైల్లో ఉండి బెయిల్పై బయటకు వచ్చారని తెలిసి ఉన్నప్పటికీ, ప్రజలు ఆయన తండ్రి మొహం చూసి నమ్మి అధికారం అప్పగిస్తే, వారి నమ్మకం నిలబెట్టుకోలేక 11 సీట్లతో తాడేపల్లి ప్యాలస్లో గృహ నిర్బందంలో ఉంటున్నారు.
జగన్కి ఎలాగూ ఏది నిర్మించడం చాతకానప్పుడు కనీసం కూటమి ప్రభుత్వం తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుకైనా మద్దతు తెలిపితే ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాల కోసం పోరాడుతున్నామని జగన్ చెప్పుకోగలిగేవారు.
కానీ బనకచర్ల ప్రాజెక్టుకి కేంద్రం అనుమతి నిరాకరించినందుకు, తాజాగా ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచర్ల ప్రాజెక్టుపై చర్చ వద్దని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ వ్రాసినందుకు వైసీపీ ఉప్పొంగిపోతోంది.
చంద్రబాబు నాయుడు, కమ్మ సామాజిక వర్గంపై వ్యక్తిగత ద్వేషంతో లక్షల కోట్లు విలువచేసే అమరావతిని పాడుపెట్టేయడానికి జగన్ వెనుకాడలేదు. పోలవరం పనులు జరగనీయలేదు. అంటే జగన్కు ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాల కంటే తన ద్వేషమే ముఖ్యమన్న మాట!
జగన్ సంతోషం ఆయన సొంత మీడియాలో అద్దంలా కనబడుతోంది. తెలంగాణ ప్రభుత్వం లేఖతో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలిందంటూ సంతోషం వ్యక్తం చేసింది. నేటి సాక్షి ఆన్లైన్ సంచికలో “బనకచర్ల: ఏపీకి షాక్ ఇచ్చిన తెలంగాణ,” అనే శీర్షికతో వచ్చిన ఆర్టికల్ చూస్తే బనకచర్ల ప్రాజెక్టు మొదలవకుండా ఆగిపోవాలని జగన్ ఎంతగా తపిస్తున్నారో? అనిపిస్తుంది.






