మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ రాజకీయ విధానాలు, ఆయన చేస్తున్న పరామర్శల ప్రశంగాలు ఆయన రాజకీయ అజ్ఞానానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అకాల గాలివానలకు అరటి పంట నష్టపోయిన రైతులను పరామర్శించడానికి తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో పర్యటించారు జగన్.
ఆ సందర్భంగా జగన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ప్రజలలో చర్చనీయాంశంగా మారింది. కళ్ళు మూసుకుంటే సంవత్సరం గడిచిపోయింది, మరో మూడేళ్లు కళ్ళు మూసుకుంటే వచ్చేది మన ప్రభుత్వమే, అప్పుడు నేను అధికారంలోకి వచ్చిన నెలకే రైతన్నలకు రాని ఇన్సురెన్సులు ఇప్పిస్తా, గిట్టుబాటు ధరలు అందజేస్తా అంటూ జగన్ రైతులకు ఇచ్చిన ఈ హామీనే ఇప్పుడు జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టేలా చేస్తున్నాయి.
కళ్ళు మూసుకుంటే ఏళ్ళు గడిచిపోతాయి…అప్పటి వరకు కళ్ళు మూసుకోండి, ఇక ఆ తరువాత నేను ముఖ్యమంత్రి అవుతా, అప్పుడు మీ కష్టాలను తీరుస్తా అంటూ జగన్ చెపుతున్న మాటలు చూస్తుంటే ఆకలితో ఉన్నప్పుడు పట్టెడన్నం పెట్టను కానీ నేను హోటల్ పెట్టాకా ప్లేట్ నిండా బిర్యానీ ఇప్పిస్తా అన్నట్టుగా ఉంది. రైతులు ఇప్పుడు పంట నష్టపోతే మరో మూడేళ్లు కళ్ళు మూసుకోండి, వచ్చేది మన ప్రభుత్వమే అప్పుడు చూసుకుందా అని చెప్పడానికి ఒక పార్టీ అధినేతగ జగన్ అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉందా.?
అసలు ఇలా ఏళ్ళ పాటు కళ్ళు మూసుకోవడానికేనా జగన్ ప్రతిపక్ష హోదా కోసం ప్రభుత్వంతో కొట్లాడుతుంది. మూడేళ్ళలో వచ్చేది మన ప్రభుత్వమే అంటూ అంత గంటాపధంగా చెపుతున్న జగన్ అసలు ఏపీలో ఎన్నికలు ఎప్పుడొస్తాయో ఇప్పుడే ఎలా నిర్ధారించగలుగుతున్నారు. ఇప్పటికే వైసీపీ పార్టీ నుండి కీలక నేతలు రాజీనామా చేసి పక్కకు జారుకున్నారు, ఇక ఆ పార్టీలో కొనసాగుతున్న ముఖ్య నేతలందరూ తమ గత ఐదేళ్ల పాపప్రక్షాళన పనిలో జైళ్ల చుట్టూ బిజీగా తిరుగుతున్నారు.
ఇక ఇటువంటి సమయంలో పార్టీ క్యాడర్ కూడా పక్క చూపులు చూడకుండా ‘ఇప్పటికే ఏడాది కళ్ళు మూసుకున్నాం, ఇంకా మరో మూడేళ్లు అలానే కళ్ళు మూసుకోండి’, ఇక ఆ పై అధికారంలోకి వచ్చేది మనమే, ఇచ్చేది మనమే అంటూ పార్టీ శ్రేణులకు జగన్ భరోసా ఇవ్వదలచుకున్నారా.? గత ఎన్నికలలో వై నాట్ 175 అంటూ ఇదే మాదిరి వైసీపీ శ్రేణులలో అతి విశ్వాసాన్ని నింపి చివరికి 11 తో బొక్క బోర్లా పడ్డారు. అయినా ఇంకా జగన్ తన తత్త్వం మార్చుకోలా.
ఇక ఇప్పుడు రెండేళ్లు, మూడేళ్లు కళ్ళుమూసుకోండి వచ్చేది మనమే అంటూ వైసీపీ శ్రేణుల కళ్ళకు ఒక మభ్య తెర కట్టాలని చూస్తున్నారు జగన్. అధికారంలో ఉంటే కళ్ళు నెత్తికెక్కిన పనులు చేయడం, అధికారంలో లేకుంటే కళ్ళు మూసుకోండి అంటూ మభ్య పెట్టడం వైసీపీకి అలవాటైన రాజకీయమే. ఇలా కళ్ళు మూసుకోవడానికేనా హోదా పోరాటలంటూ వైసీపీ ఆరాటపడుతుంది అంటున్నారు సామాన్య ప్రజానీకం.




