నేడు చెన్నైలో తమిళనాడు సిఎం స్టాలిన్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన కేంద్రం ప్రతిపాదనని వ్యతిరేకిస్తూ స్టాలిన్ ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటున్నారు.
వైసీపీ అధినేత జగన్ కూడా ఈ ప్రతిపాదనని వ్యతిరేకిస్తున్నారు. కానీ సింహం వంటివాడినని ప్రగల్భాలు పలికే జగన్ ఈ సమావేశంలో పాల్గొనేందుకు ధైర్యం చాలలేదు.
అలాగని ఊరుకుంటే ఈ ప్రతిపాదనకి మద్దతు తెలుపుతున్నట్లవుతుంది. కనుక మధ్యేమార్గంగా ఈ ప్రతిపాదనపై పునరాలోచన చేయాలంటూ ప్రధాని మోడీకి ఓ లెటర్ వ్రాసి, పోస్టుబాక్సులో పడేసి చేతులు దులుపుకున్నారు. ఆ లేఖని మీడియాకు విడుదల చేసి ‘మమ’ అనిపించేశారు.
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఎన్డీఏతో ఉన్నారు కనుక ఈ సమావేశానికి వెళ్ళలేదు. కానీ జగన్ ఎన్డీఏలో లేరు కదా?అంటే కేసుల భయంతోనే వెళ్ళలేదని అందరికీ తెలుసు. తాను ప్రధాని మోడీకి విధేయంగానే ఉన్నానని ఈవిదంగా జగన్ సంకేతం పంపించిన్నట్లు భావించవచ్చు.
గతంలో చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీతో విభేదించి బీజేపికి దూరమయ్యారు. కానీ 2024 ఎన్నికలకు ముందు మళ్ళీ ప్రధాని మోడీకి, బీజేపికి దగ్గరైనప్పుడు జగన్ ఆయనని చాలా ఎద్దేవా చేశారు. అయితే చంద్రబాబు నాయుడు ధైర్యంగా, బహిరంగంగానే బీజేపితో పొత్తులు పెట్టుకున్నారు.
చంద్రబాబు నాయుడు, కేసీఆర్ రాజకీయంగా ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ అవసరమైనప్పుడు ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతుంటారు.
కానీ జగన్ ఎప్పుడూ ఇటువంటి లోపాయికారి స్నేహాలు, బంధాలే తప్ప ధైర్యంగా, బహిరంగంగా ఏదీ చేయ(లే)రని మన సింహానికి ఎప్పుడూ భయమేనని మరోసారి నిరూపించుకున్నారు. ఇంత పిరికితనంతో వ్యవహరించే జగన్ ప్రగల్భాలు పలుకుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది.
సిఎం చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా జగన్ ఢిల్లీలో దీక్ష చేపట్టినప్పుడు కాంగ్రెస్ మిత్ర పక్షాలు వచ్చి సంఘీభావం ప్రకటించాయి. కానీ ఈ సమస్యపై పోరాడేందుకు కలిసి రమన్నమని అవి ఆహ్వానిస్తే, జగన్ మొహం చాటేశారు. కనుక రేపు ఏ అవసరం వచ్చినా జగన్ పిలిస్తే పలికేవారే ఉండరు.




