వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు తాడేపల్లి ప్యాలస్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన వైసీపీ క్యాడర్తో సమావేశం నిర్వహించి ‘మావిగన్, పాదయాత్ర’ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
“ప్లాన్-ఏలో భాగంగా నేను విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పాను. కానీ అయన వినకుండా అమరావతి నిర్మిస్తున్నారు. కనుక తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మించుకునేందుకు నేను ప్లాన్-బిగా ‘మావిగన్’ సూచించాను. కానీ దోచుకో, దాచుకో అనే సిద్దాంతంతో పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు అమరావతికే మొగ్గు చూపుతున్నారు,” అని అన్నారు.
ఇప్పుడు ప్లాన్-ఏ, ప్లాన్-బీలు సిఎం చంద్రబాబు నాయుడుకి చెప్తున్న జగన్మోహన్ రెడ్డి తాను ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాటిని ఎందుకు అమలుచేయలేదు? తాను అమలుచేయనివాటిని తన రాజకీయ ప్రత్యర్ధి అమలుచేయాలని ఎలా ఆశిస్తున్నారు? అనే రెండు ప్రశ్నలకు ఆయనే సమాధానం చెప్పి ఉంటే బాగుండేది కదా? అయినా నాడు చంద్రబాబు నాయుడు మూడు రాజధానులు వద్దని చెపితే జగన్ విన్నారా?లేదు కదా? మరిప్పుడు తాను చెప్తే చంద్రబాబు నాయుడు ఎందుకు వినాలి? వినకపోతే నిందించడం దేనికి?
అయినా దేశంలో చక్కటి ప్లాన్డ్ సిటీగా అమరావతిని నిర్మిస్తున్నప్పుడు, ఎటువంటి ప్రణాళికా లేకుండా అభివృద్ధి చెందిన ‘మావిగన్’ మద్య రాజధాని ఏర్పాటు చేస్తే, హైదరాబాద్, ముంబాయి నగరాల్లా నిత్యం సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి కదా? అప్పుడు హైడ్రా ఏర్పాటు చేసుకొని అడ్డంగా ఉన్నవాటిని కూల్చేసుకోవాలా?
వచ్చే ఏడాది నుంచి జగన్ పాదయాత్ర చేస్తానని చెప్పుకున్నారు. అది ఆయనిష్టం. కానీ పాదయాత్ర మొదలుపెట్టాక ప్రతీరోజూ సిఎం చంద్రబాబు నాయుడుకి సినిమా చూపిస్తానని బెదిరించడం తప్పు.
అంబటి రాంబాబు వంటి వైసీపీ నేతలు చెలరేగిపోతే పోలీసులు ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారో జగన్కి బాగా తెలుసు. కనుక సినిమా చూపించాలనుకుంటే దాని పర్యవసానాలకు కూడా వైసీపీ సిద్ధంగా ఉండక తప్పదు.
జగన్ తాను ఆదర్శవంతంగా వ్యవహరిస్తూ వైసీపీ శ్రేణులను ప్రజలు మెచ్చుకునేలా సన్మార్గంలో నడిపించాలి. కానీ ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో ఇంత విధ్వంసకరంగా ఉన్నాయి. ఈ అవలక్షణాలే తనకి, తన పార్టీకి బలమని జగన్ గట్టిగా నమ్ముతుంటే, పార్టీ శ్రేణులు కూడా ఆయనకు తాన తందాన పాడుతున్నాయి.
ఆలోచనలు సరిగ్గా లేకపోతే మాట సరిగ్గా ఉండదు. మాట సరిగ్గా ఉండకపోతే వ్యవహారశైలి సరిగ్గా ఉండదు. ఈ మూడు సరిగ్గా లేనివారిని ప్రజలు ఎందుకు ఆదరించాలి?




