గ్లాసులో సగం నీళ్ళున్నప్పుడు ఆశావాదికి ‘ఇంకా సగం ఉన్నాయి కదా’ అనుకుంటే నిరాశావాది ‘సగం గ్లాసు ఖాళీ అయిపోయిందిగా’ అనుకుంటాడు.
రాష్ట్ర విభజన తర్వాత, జగన్ పాలన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇలాగే ఉండేది. ఇక ఏపీ ఫినిష్.. అందరూ అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టడమే కాదు అభివృద్ధి పధంలో నడిపించి చూపుతున్నారు. జగన్ కంటే మిన్నగా సంక్షేమ పధకాలు అమలుచేసి చూపుతున్నారు.
కానీ చంద్రబాబు నాయుడు పాలనలో ఆంధ్రప్రదేశ్ సర్వ నాశనం అయిపోతోందని జగన్ వాపోతుంటారు. ఈ విషయంలో కూడా జగన్లో నిరాశావాదం కనిపిస్తోంది.
సిఎం చంద్రబాబు నాయుడు ఇంత వేగంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ, ఊహించని విదంగా సంక్షేమ పధకాలు కూడా అమలు చేస్తుంటే, రేపు ఎన్నికలలో ప్రజలు వైసీపీని పట్టించుకుంటారా?లేకపోతే మన పరిస్థితి ఏమిటి?అనే భయం, ఆందోళనతోనే జగన్ పరామర్శ యాత్రల తీరు మారిందని చెప్పవచ్చు.
బలప్రదర్శన చేస్తూ ప్రజలు, పోలీస్ అధికారులు, ప్రభుత్వ అధికారులలో భయం పుట్టించగలిగితే చాలు, రాష్ట్ర రాజకీయాలను మార్చవచ్చని జగన్ భావిస్తున్నట్లున్నారు.
కనుక సిఎం చంద్రబాబు నాయుడు, ప్రభుత్వంపై బురద జల్లేందుకు చేతికి అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.
సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడటం, జైలు నుంచి నందిగం సురేష్ విడుదల వాటిని కూడా వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఏదో విదంగా రాజకీయాలని వక్రమార్గం పట్టించి అందరూ ఆ దారిలోనే నడిచేలాచేసి రాష్ట్ర రాజకీయాలపై పట్టు సాధించాలని జగన్ ప్రయత్నిస్తున్నారని అర్దమవుతూనే ఉంది. కానీ అవి ఫలించవు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు మంచి చెడులని చూడగల విచక్షణ పుష్కలంగా ఉంది కనుక.
ఉదాహరణకు రాష్ట్ర విభజన తర్వాత ప్రజలు జగన్కి అవకాశం ఇచ్చి ఉండవచ్చు. కానీ అందుకు ఆయన సమర్ధుడు కారని భావించడం వల్లనే చంద్రబాబు నాయుడుకి పగ్గాలు అప్పగించారు. ఆయన వారి నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు.
అయినా ప్రజలు జగన్కి కూడా ఓ అవకాశం ఇచ్చారు. కానీ తన సమర్దత నిరూపించుకోలేకపోయారు. ఎన్ని లక్షల కోట్లు పంచినా ప్రజల నమ్మకాన్ని పొందలేకపోయారు. అందుకే ప్రజలు మళ్ళీ చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర పగ్గాలు అప్పగించారు.
కనుక తాను చేస్తున్న ఈ వికృత రాజకీయాలను ప్రజలు గమనించడం లేదని లేదా వారికి అర్దం చేసుకునేంత జ్ఞానం లేదని జగన్ అనుకుంటే అంత కన్నా పొరపాటు ఉండదు. కానీ అనుకుంటున్నారు. అందుకే ఇలా వ్యవహరిస్తున్నారు. జగన్ వైఖరే వైసీపీకి శాపంగా మారుతుంది. కానీ సరిగ్గా అదే ఆయన వలన నష్టపోయిన టీడీపీకి, కూటమి ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకు మేలు కలుగుతుంది. కనుక జగన్ ఇలాగే కంటిన్యూ అయిపోవాలని అందరూ కోరుకుందాము.




