జగన్ శాసనసభ సమావేశాలకు వచ్చేందుకు ప్రధాన ప్రతిపక్షహోదా కావాలి కానీ జనం మద్యకు వచ్చేందుకు అవసరం లేదు. కానీ ఎవరైనా చనిపోతే లేదా వైసీపీ నేతలు ఎవరైనా జైలుకి వెళితే తప్ప తాడేపల్లి ప్యాలస్ నుంచి బయటకు రారు.
“ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే వినన్నట్లు..,” ఒకసారి ప్యాలస్ నుంచి బయటకు వస్తే జగన్ తాను ఎందుకు బయటకు వచ్చానో మరిచిపోయి రోడ్ షోలు చేసేస్తుంటారు. ఈరోజు జగన్ బాపట్ల జిల్లా మేదరమెట్లకు వచ్చినప్పుడు అదే చేశారు.
వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ చనిపోవడంతో ఆమె భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు జగన్ ప్యాలస్లో నుంచి బయటకు వచ్చారు. హెలికాఫ్టర్లో అక్కడకు చేరుకునేసరికే అక్కడ ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు వైసీపీ నేతలు, వారు సిద్దం చేసిన కార్యకర్తలు ఉన్నారు.
వారందరూ వెంట రాగా జగన్ ఊరేగింపుగా వైవీ సుబ్బారెడ్డి ఇంటికి బయలుదేరారు. దారి పొడవునా ఆయనకు ‘జై జగన్’ అంటూ నినాదాలు చేసేవారు కూడా సిద్దంగానే ఉన్నారు.
జగన్ వారికి అభివాదాలు చేస్తూ వైవీ సుబ్బారెడ్డిఇంటికి చేరుకున్నారు. అంతవరకు సంతోషంతో చిర్నవ్వులు చిందించిన జగన్, వైవీ సుబ్బారెడ్డి ఇంట్లోకి ప్రవేశించగానే ఎంతో బాధపడుతున్నట్లు విచారంగా మొహం పెట్టి ఆమె భౌతికకాయానికి నివాళులు అర్పించి వైవీ సుబ్బారెడ్డిని ఓదార్చారు. అంటే అక్కడకు చేరుకునే వరకు తాను ఎందుకు బయటకు వచ్చాననే విషయం మారిచిపోయారా? లేదా నిమిషాల వ్యవధిలో హవాభావాలు మార్చగల నేర్పు ఉందనుకోవాలా?
పార్టీలో ఓ సీనియర్ నేత తల్లి చనిపోతే పరామర్శించేందుకు వెళుతున్నాననే ఇంగితం కూడా లేకుండా, ఎన్నికలలో గెలిచి విజయయాత్ర చేస్తున్నట్లు లేదా నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నట్లు దారి పొడవునా జేజేలు పలికించుకుంటూ రోడ్ షో నిర్వహించడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
జనం చేత జేజేలు పలికించుకోవాలనే ఇంత తపన ఉన్నట్లయితే ఏ పాదయత్రో పెట్టుకొని జనం మద్యకు రావచ్చు కదా?
దీనిలో కొసమెరుపు ఏమిటంటే, అధికారంలో ఉన్నప్పుడు ప్రాణ భయంతో చుట్టూ పరదాలు కట్టించుకున్న జగన్ ఇప్పుడు పరదాలు లేకుండా చెట్లు నరికించకుండానే బయట తిరుగుతుండటం!




