ఏపీ మాజీ సిఎం జగన్ మళ్ళీ లండన్ బయలుదేరుతున్నారు. కానీ దేశం విడిచి వెళ్ళాలంటే ముందుగా నాంపల్లి సీబీఐ కోర్టు అనుమతి తప్పనిసరి. కనుక అందుకు దరఖాస్తు చేసుకోక తప్పలేదు. జగన్ దంపతులు ఇదివరకు లండన్, అమెరికా వెళ్ళేందుకు తమ కుమార్తెల చదువులు, స్నాతకోత్సవాలను కారణాలుగా చూపేవారు.
కానీ వారి చదువులు పూర్తయిపోయినా వారు అక్కడే ఉంటున్నారు. జగన్ దంపతులు అవసరమైనప్పుడు విదేశాలకు వెళ్ళేందుకే వారిని అక్కడే ఉంచారని గిట్టనివారు ప్రచారం చేస్తుంటే, వారు చదువులు పూర్తి చేసుకొని అక్కడే ఉద్యోగాలలో స్థిరపడుతున్నారని అందుకే అక్కడే ఉంటున్నారని అభిమానులు చెప్పుకుంటున్నారు.
ఏది ఏమైనప్పటికీ జగన్ విదేశీ యాత్రకు బలమైన ఓ కారణం ఏర్పాటయిందని స్పష్టం అవుతోంది. ఈసారి ఎందుకంటే, లండన్లో ఉన్న తన కూతురు పుట్టినరోజు వేడుకలకట!ఎప్పటిలాగే జగన్ విదేశీ యాత్రకు సీబీఐ అభ్యంతరం చెప్పినప్పటికీ కోర్టు అనుమతి మంజూరు చేసింది.
కనుక సెప్టెంబర్ 3 నుంచి 25వ తేదీ వరకు అంటే మూడు వారాలు జగన్ విదేశాలలో గడిపేందుకు సీబీఐ కోర్టు అనుమతించింది.
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్ విదేశాలకు వెళ్ళేందుకు సీబీఐ కోర్టు తీసుకోవలసి వచ్చేది. జగన్ ఇప్పుడు వైసీపి ఎమ్మెల్యే మాత్రమే. కనుక ఆయన ‘డిప్లొమాట్ పాస్ పోర్ట్’ స్వాధీనం చేసుకొని సాధారణ పాస్ పోర్ట్ జారీకి అనుమతించింది. కనుక జగన్ ప్రత్యేక విమానం వేసుకొని లండన్ బయలుదేరుతారని అనుకోలేము. ఎందుకంటే ఇప్పుడు సొంత డబ్బు ఖర్చు చేయాలి కనుక సాధారణ ప్రయాణికులతో కలిసే వెళ్ళవచ్చు.
జగన్ విదేశీయాత్రకు సీబీఐ కోర్టు అనుమతీస్తే వైసీపి శ్రేణులకు పండగే. అలాగే జగన్ దంపతులు లండన్లో దిగగానే అక్కడా ఘనా స్వాగతం, హడావుడి ఉండనే ఉంటుంది. మళ్ళీ తిరిగి రాగానే గన్నవరం విమానాశ్రయంలో కూడా ఘనస్వాగతం హడావుడి ఉండనే ఉంటుంది. కనుక జగన్ విదేశీ యాత్రలకు సీబీఐ అనుమతి తీసుకోవలసి రావడం ఎంతమాత్రం సిగ్గుపడాల్సిన విషయం కాదు. పండగ చేసుకునే అవకాశంగానే చూడాల్సి ఉంటుంది.




