ఒక తప్పు చేస్తే వెంటనే సరిదిద్దుకోవచ్చు. కానీ ఒక అబద్దం చెపితే ఒప్పుకోలేరు. కనుక దానిని కప్పిపుచ్చుకునేందుకు మరిన్ని అబద్దాలు చెపుతూనే ఉండాలి. వైసీపీ అధినేత జగన్ కనీసం తన తప్పులు సరిదిద్దుకోకపోగా వరుసగా అబద్దాలు చెపుతూ ప్రజలను, పార్టీ శ్రేణులను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రధాన ప్రతిపక్షహోదా ఇస్తేనే శాసనసభకు వస్తానని లేకుంటే రానని జగన్ తెగేసి చెప్పారు. దాని కోసం హైకోర్టులో కేసు కూడా వేశారు.
కానీ ఇప్పుడు తనకు హోదా ముఖ్యం కాదని సభలో ఎక్కువ సేపు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం వల్లనే శాసనసభకు రావడంలేదన్నారు!
ప్రెస్మీట్లో ఒకటి రెండు అంశాలపై మాట్లాడితేనే గంటన్నర సమయం పట్టిందని, అన్ని అంశాలపై మాట్లాడాలంటే ఇంకెంత సమయం పడుతుందో ఆలోచించాలన్నారు.
కనుక తనకు ఎక్కువ సేపు మైక్ ఇస్తే నేటి నుంచే శాసనసభకు హాజరవుతానన్నారు. కానీ ఇవ్వరు కనుక రానన్నారు. శాసనసభలో ప్రజల గొంతు వినడం సిఎం చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు కనుకనే తనను రాకుండా సభకు అడ్డుకుంటున్నారని జగన్ ఆరోపించారు.
ఇంతకాలం ప్రధాన ప్రతిపక్షహోదా అంటున్న జగన్, ఇప్పుడు హటాత్తుగా మైక్ అంటూ మాట మార్చారు. తాను సభకు రాకపోవడానికీ సిఎం చంద్రబాబు నాయుడే కారణమని ఆరోపించడం అతి తెలివి ప్రదర్శించడమే కదా?
వైసీపీ ఎమ్మెల్యేలను శాసనసభ సమావేశాలకు వెళ్ళవద్దని తాను చెప్పలేదని వెళ్తే వెళ్ళవచ్చన్నారు. ఎమ్మెల్యేలను తీసుకొని శాసనసభ సమావేశాలకు వెళ్ళమని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి చెపితే ఆయన నిరాకరించారట!
జగన్ రాకపోయినా ఎమ్మెల్సీలను మండలి సమావేశాలకు పంపిస్తూనే ఉన్నారు. అలాగే ఎమ్మెల్యేలను కూడా పంపించవచ్చు. కానీ వారే ఇష్టపడటం లేదట!
జగన్ ఆదేశిస్తే వెంటనే రోడ్లపై ధర్నాలు, ర్యాలీలు చేసే ఎమ్మెల్యేలు, శాసనసభ సమావేశాలకు వెళ్ళమని ఆదేశిస్తే వెళ్ళకుండా ఉంటారా? అంటే కాదనే తెలుసు. కానీ వారే వెళ్ళడానికి ఇష్టపడటం లేదని తేల్చేశారు.
శాసనసభ సమావేశాలకు వస్తే జగన్ అహం దెబ్బ తింటుందనే భయంతోనే రావడం లేదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ఇది అక్షరాల నిజం. నాడు శాసనసభలో తాను చంద్రబాబు నాయుడుని అవమానించినట్లే ఇప్పుడు అయన కూడా తనని అవమానిస్తారనే భయంతోనే రావడం లేదని అందరికీ తెలుసు. లోలోన ఉన్న ఈ భయాందోళనలు జగన్ పైకి చెప్పుకోలేరు కనుక హోదా, మైకు అంటూ కుంటి సాకులు చెపుతున్నారు…. అంతే!
జగన్ ప్రజా సమస్యలపై మాట్లాడే వంకతో సిఎం చంద్రబాబు నాయుడుని, కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించాలని అనుకుంటున్నారు. సభలో ఉన్నంత సేపు తానే మాట్లాడుతూ టీడీపి సభ్యులు తనని అవమానించకుండా తప్పించుకోవాలను జగన్ కొత్త ఎత్తుగడ వేసిన్నట్లు అర్ధమవుతూనే ఉంది. కానీ కుదరదు కనుక తాను సభకు రాకపోవడానికి సిఎం చంద్రబాబు నాయుడే బాధ్యులంటూ నిందిస్తున్నారు.
కానీ శాసనసభ సమావేశాలంటే తాడేపల్లి ప్రెస్మీట్లు కావనే సంగతి జగన్ గ్రహించాలి. సభకు రావడానికి ఇలా కొత్త కొత్త సాకులు, షరతులు చెపుతుంటే ప్రజలు నవ్వుకుంటారని గ్రహించాలి.






