రాజధాని కేసు ఏప్రిల్‌కు వాయిదా… అందరికీ మంచిదే!

Jagan_Supreme_Court_Amaravati_Lands

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని కేసుని సుప్రీంకోర్టు ఏప్రిల్‌కు వాయిదా వేసింది. జగన్‌ ప్రభుత్వం మూడు రాజధానుల కొరకు చట్టం చేసినప్పుడు, దానిపై అభ్యంతరాలు తెలుపుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు 2022, మార్చి 3న తీర్పు చెపుతూ రాష్ట్ర ప్రభుత్వానికి అటువంటి చట్టాలు చేసే అధికారం లేదని తీర్పు చెప్పింది.

ఆ తీర్పుని సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించగా దానిపై బుధవారం విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, రాజధాని రైతుల తరపు న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత ఈ కేసుని ఏప్రిల్‌కు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం బుధవారం తెలిపింది.

ADVERTISEMENT

సుప్రీంకోర్టు ఈ కేసుని ఏప్రిల్‌కు వాయిదా వేయడం వలన అటు అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకొంటున్నవారికి, ఇటు విశాఖ రాజధానిగా చేయాలనుకొంటున్న వైసీపి ప్రభుత్వానికి కూడా ఊరట లభించిందని చెప్పవచ్చు.

ఒకవేళ అమరావతి రాజధానిగా ఉండాలని సుప్రీంకోర్టు తీర్పు చెపితే వైసీపికి అది పెద్ద ఎదురు దెబ్బ అవుతుంది. సుప్రీంకోర్టు ఎటూ తేల్చకుండా కేసుని ఏప్రిల్‌కు వాయిదా వేసినందున వైసీపి నేతలు ప్రజలకు ఇదే సాకు చూపుతూ, శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తే ఈసారి తప్పకుండా విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పుకొనే వెసులుబాటు లభించింది.

ముఖ్యంగా విశాఖని రాజధానిగా ప్రకటించి కార్యాలయాలను, వాటిలో అధికారులు, ఉద్యోగులను విశాఖకు తరలించాల్సి వచ్చేది. కానీ వైసీపికి ఇప్పుడు ఆ బాధ, భారం రెండూ తప్పిపోయాయి.

రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికే పూర్తి అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన్నట్లయితే, వైసీపి ప్రభుత్వం విశాఖని రాజధానిగా ప్రకటించి, కార్యాలయాలను, వాటిలో అధికారులు, ఉద్యోగులను విశాఖకు తరలిస్తుంది. అదే జరిగితే శాసనసభ ఎన్నికలలో టిడిపి, జనసేనలు గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా, మళ్ళీ రాజధానిని అమరావతికి మార్చలేక, దాని కోసం న్యాయపోరాటాలు చేయవలసి వచ్చేది. కనుక ఈ కేసు ఏప్రిల్‌కు వాయిదా పడటమే అందరికీ మంచిది.

ADVERTISEMENT
Latest Stories