వైసీపీ అధినేత జగన్ నేడు మరోసారి ప్రభుత్వం, ప్రజలు, పోలీసులపై దండయాత్రకు బయలుదేరుతున్నారు. ఈ బలప్రదర్శనకు ఆయన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మామిడి రైతుల సమస్యలు తెలుసుకునేందుకు అనే ఓ కారణం చూపుతున్నారు.
పోలీసులు వారిస్తున్నా వినకుండా వేలాదిమంది కార్యకర్తలు, వాహనాలతో ఊరేగింపుగా బంగారుపాళ్యం మామిడి మార్కెట్ చేరుకుంటారు.
జగన్ మామిడి రైతుల కష్టాలు తెలుసుకోవాలనుకుంటే ఎవరూ తప్పు పట్టరు. ప్రభుత్వానికి కూడా అభ్యంతరం లేదు. జగన్ తన వెంట 500 మందిని తీసుకువెళ్ళినా అభ్యంతరం లేదని జిల్లా పోలీసులు చెపుతున్నారు. కానీ 25-30,000 మందితో జగన్ వెళుతున్నారు!
ముఖ్యమంత్రిగా చేసిన జగన్ చట్టాలను, పోలీసులను గౌరవిస్తూ పార్టీలో వారికి, ప్రజలకు కూడా ఆదర్శంగా నిలవాలి. కానీ ఈవిదంగా వేలాదిమందితో దండయాత్రలు చేస్తూ ప్రభుత్వాన్ని, పోలీసులను, ప్రజలను భయపెట్టి రాజకీయంగా పైచేయి సాధించాలనుకోవడం చాలా దారుణమైన ఆలోచనే.
ఒకవేళ జగన్ రాజకీయాలు చేయాలనుకుంటే దానికి చాలా సులువైన, ప్రజాస్వామ్యబద్దమైన పద్దతులున్నాయి. ఇదివరకులా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయవచ్చు లేదా రాష్ట్రంలో ఎక్కడ కావాలనుకుంటే అక్కడ బహిరంగ సభలు నిర్వహించుకోవచ్చు లేదా శాసనసభకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు.
తన బలప్రదర్శనలతో సిఎం చంద్రబాబు నాయుడుని, కూటమి ప్రభుత్వాన్ని, పోలీసులను ఒత్తిడికి గురి చేయడం ద్వారా వారి ఆత్మ స్థయిర్యం దెబ్బతీయవచ్చని జగన్ యోచిస్తున్నట్లున్నారు. కనుక ఇదేదో చాలా గొప్ప వ్యూహామని జగన్ అనుకుంటునట్లున్నారు.
కానీ తన బలప్రదర్శనలతో సామాన్య ప్రజలు కూడా భయపడేలా చేస్తున్నప్పుడు మళ్ళీ అధికారంలోకి ఎలా రాగలనని ఎలా అనుకుంటున్నారో జగన్కే తెలియాలి. ప్రజలలో ఆయన పట్ల వ్యతిరేకత, భయం పెరిగితే నష్టపోయేది వైసీపీయే కదా?
పైగా ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ళ సమయం ఉండగా ఇప్పటి నుంచే ఈ దండయాత్రల కోసం వైసీపీ నేతల జేబులు ఖాళీ చేయించేస్తుంటే, తీరా చేసి ఎన్నికలొచ్చేసరికి వైసీపీ నేతలు ఎవరూ ఖర్చుపెట్టలేని పరిస్థితికి చేరుకుంటే అప్పుడు జగన్ వారందరికీ సొంత డబ్బు ఖర్చుపెట్టి ఎన్నికలలో గెలిపించుకుంటారా?కాదని వైసీపీ నేతలకు కూడా తెలుసు.
కనుక జగన్ దండయాత్రలతో ముందుగా తమ జేబులు ఖాళీ అయిపోతున్నాయని గ్రహిస్తే మంచిది. జగన్పై నమ్మకంతో ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టినా ఎన్నికలప్పుడు జగన్ తమని కాదని వేరేవారికి టికెట్స్ ఇస్తే తమ పరిస్థితి ఏమిటని వైసీపీ నేతలు ఇప్పుడే ఆలోచించుకుంటే మంచిది.






