వైసీపీ రాజకీయ విధానాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ పార్టీ అధినేత సిఎం చంద్రబాబు నాయుడుని అమితంగా ద్వేషిస్తారు కనుక ఆ ద్వేషమే వైసీపీ రాజకీయ విధానంగా నడుస్తోంది. ఈ విధానంతోనే లక్షల కోట్లు విలువ చేసే అమరావతిని పాడు బెట్టేశారు. పేదల ఆకలి తీర్చుతున్న అన్నా క్యాంటీన్లు మూసేశారు. ఇలా ఒకటా రెండా అనేక ఉదాహరణలున్నాయి.
సాధరణంగా ఏ రాజకీయ పార్టీ అధినేత అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ప్రజా సమస్యలపై శాసనసభలో నిలదీస్తాడు. నిత్యం ప్రజల మద్య ఉంటూ మమేకం అవుతాడు. పార్టీ శ్రేణుల వద్దకే వెళ్ళి ధైర్యం చెపుతాడు. కానీ ఈ విషయంలో కూడా వైసీపీ అధినేత జగన్ విధానం ఏవిధంగా ఉందో అందరూ కళ్ళారా చూస్తూనే ఉన్నారు.
ఎన్నికల సమయంలో గెలిచేందుకు హామీలు ఇవ్వడం సర్వసాధారణమే. కానీ 2019లో జగన్ సిఎం అయిన మర్నాటి నుంచే 2024 ఎన్నికల కోసం సంక్షేమ పధకాల పేరుతో ప్రజలకు డబ్బు పంచుతూ ఓటు బ్యాంకు నిర్మించుకునే ప్రయత్నం చేశారు.
దీని కోసం అప్పులు చేయడమే కాకుండా రాష్ట్రాభివృద్ధిని పక్కన పెట్టేశారు. అభివృద్ధి మరిచి అప్పులు చేసి డబ్బు పంచిపెట్టే రాజకీయ విధానాన్ని ఏమనాలి?
రాజకీయాలలో అధికార ప్రతిపక్షాల మద్య విమర్శలు, పరస్పర ఆరోపణలు సహజమే. అధికార పార్టీ పాలన, అభివృద్ధి సాగిస్తూనే రాజకీయాలు చేస్తుంటుంది. కూటమి ప్రభుత్వం అలాగే చేస్తోంది.
కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దాని పాలన, ప్రాధాన్యతలు ఏవిధంగా ఉన్నాయో అందరూ చూశారు. ముఖ్యంగా రాజకీయాలలో ఉన్న మహిళలను, వాటితో సంబంధమే లేని మహిళలతో ఏవిధంగా వ్యవహరించిందో అందరికీ తెలుసు.
రాజకీయాలలో వ్యూహాలు, ప్రతి వ్యూహాలు సహజమే. కానీ వ్యూహాలు వేరు కుట్రలు వేరు. వాటి మద్య సన్నటి గీతని చెరిపేసి కుట్రలు, దుష్ప్రచారం చేస్తూ అవే గొప్ప వ్యూహాలుగా భ్రమిస్తోంది వైసీపీ.
పశ్చిమాసియా యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడితే అమరావతి వల్లనే కొరత ఏర్పడిందని, దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే దానికీ సిఎం చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వమే కారణమంటూ వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయడం ఇందుకు చక్కటి ఉదారణలు. ఈవిధంగా అసూయ, ద్వేషం, దుష్ప్రచారం వంటి అవలక్షణాలనే పార్టీ విధానాలుగా మార్చుకొని వైసీపీ పనిచేస్తోంది.
మరో పక్క కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవ్యమైన రాజధాని అమరావతిని, జీవనాడి వంటి పోలవరాన్ని, రాష్ట్రానికి అనేక రైలు, రోడ్ ప్రాజెక్టులు, పోర్టులు, ఎయిర్ పోర్టులు చకచకా నిర్మిస్తోంది.
అటు చిత్తూరు నుంచి ఇటు శ్రీకాకుళంలోని ఇచ్చాపురం వరకు లక్షల కోట్ల పెట్టుబడులతో అనేక పరిశ్రమలు, ఐటి కంపెనీలు తీసుకు వస్తోంది. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ క్యాలండర్ ప్రకటిస్తే, కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలండర్ ప్రకటించి ఆ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తోంది.
డీఎస్సీని వైసీపీ రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలని ప్రయత్నించి భంగపడితే, కూటమి ప్రభుత్వం కేవలం ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి మాత్రమే డీఎస్సీ అమలుచేస్తోంది.
వైసీపీ, టీడీపిల రాజకీయ, పాలన, ఆలోచన విధానాల మద్య ఉన్న తేడా ఇంత స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలకు మంచి చెడు చూడగలరు. బేరీజు వేసుకునే విచక్షణా జ్ఞానం కూడా పుష్కలంగా ఉందని 2024 ఎన్నికలలో నిరూపించారు కూడా.
అయినా మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని జగన్ చెపుతున్నారు. మంచిదే! కానీ మనసులోనైనా నమ్ముతున్నారో లేదో?




