ఏపీ రాజకీయాలలో జగన్ ప్రవేశించినప్పటి నుంచి వాటి తీరు సమూలంగా మార్చేశారు. అది మంచికే అయితే అందరూ చాలా సంతోషించేవారు. కానీ కుల రాజకీయాలతో సలసల మరుగుతున్న ఏపీ రాజకీయాలకు జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలు కూడా జోడించారు.
కనుక పద్దతిగా రాజకీయాలు చేసుకుంటామంటే ఏపీలో ముఖ్యంగా.. వైసీపీలో కుదరదని ఆ పార్టీలో ఇమడలేక బయటకు వచ్చిన పలువురు సీనియర్ నేతలే చెప్పారు కూడా.
జగన్ అధికారంలో ఉన్నప్పుడే తనదైన శైలిలో ఫ్యాక్షన్ మార్క్ రాజకీయాలు చేశారు. ఎన్నికలలో ఓడిపోయారు కనుక పద్దతి మార్చుకుంటారేమో అంటే నేటికీ తలకాయలో.. మామిడికాయలో తొక్కుకుపోతూనే ఉన్నారు. రప్ప రప్ప అని బెదిరిస్తూనే ఉన్నారు. చేయకూడనివన్నీ చేస్తూ తిరిగి ప్రభుత్వాన్ని, పోలీసులనే నిందిస్తున్నారు కూడా.
ఆయన పరామర్శ యాత్రకు డేట్ ప్రకటించిన రోజు నుంచి అది ముగిసిన రెండు మూడు రోజుల వరకు వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని, ముఖ్యంగా సిఎం చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేసుకొని విమర్శలు ఆరోపణలు గుప్పిస్తూనే ఉంటారు. కనుక జగన్ పరామర్శ యాత్రలు ఓ పద్దతిగా సాగుతున్నాయని స్పష్టమవుతోంది.
జగన్, వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తుంటే మంత్రులు స్పందించకపోవడాన్ని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు తప్పు పట్టారు. కొందరిపై ఆగ్రహించారు కూడా.
కనుక జగన్ని ఎదుర్కోవడంలో కూటమి ప్రభుత్వం సమర్ధంగా వ్యవహరించలేకపోతోందని, జగన్ పాచిక పారుతోందని అర్దమవుతోంది. కనుక జగన్ వలలో కూటమి ప్రభుత్వం చిక్కుకుందా?అనే సందేహం కలుగుతుంది.
కానీ జగన్ పరామర్శ యాత్రల పేరుతో వేలాదిమందిని పోగేసి చేస్తున్న బల ప్రదర్శనలు, దండయాత్రలు, మళ్ళీ వాటిలో కూడా అచకాలు కూడా చేస్తూనే ఉన్నారు.
ప్రజలందరూ ఇవన్నీ నిశితంగా గమనిస్తున్నారనే విషయం ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుకి కూడా బాగా తెలుసు. కనుక జగన్ అధికారంలో ఉన్నా లేకపోయినా ఏవిదంగా వ్యవహరిస్తారో, ఒకవేళ మళ్ళీ వస్తే ఎంత భయంకరంగా వ్యవహరించబోతున్నారో, తాను లేదా కూటమి నేతలు ప్రజలకు చెప్పడం కంటే జగన్ నోటితోనే చెపుతుంటే వినేలా చేస్తేనే ప్రజలకు జగన్ అంటే భయం పుడుతుందని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లున్నారు.
లేకుంటే జగన్ని, ఆయన పరామర్శ యాత్రలని కట్టడి చేయడం ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు నిమిషం పట్టదు కదా?
కనుక ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఉచ్చులో జగన్ చిక్కుకుని తానే తెలివైనవాడిని, బలవంతుడిననే గుడ్డిగా ముందుకు సాగుతున్నారు.
జగన్ అలా గుడ్డి భ్రమతోనే 175/175 అనుకుంటూ ఎన్నికలకు వెళ్ళి బోర్లా పడ్డారు. కనుక వీలైనంత వరకు జగన్ని ఈ భ్రమలో కొనసాగేలా చేయడమే మంచిదని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఉపేక్షిస్తున్నట్లనిపిస్తుంది.
కనుక చంద్రబాబు నాయుడు, జగన్ ఇద్దరిలో ఎవరి ఉచ్చులో ఎవరు చిక్కుకున్నారో ప్రజలే ఆలోచించుకొని సమాధానం తెలుసుకోవలసి ఉంటుంది.




