జగన్ చెప్పుకున్నట్లు సంక్షేమ పధకాలతో వైసీపికి 175 రాకపోయినా కనీస మెజార్టీతో గెలిచి తప్పకుండా మళ్ళీ అధికారంలోకి రాగలమని వైసీపి నేతలందరూ అనుకునే ఉంటారు. కానీ దారుణంగా ఓడిపోవడం చూసి వారే కాదు జగన్ చెప్పిన్నట్లు యావత్ దేశ ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు.
గత ఎన్నికలలో జగన్ వలననే వైసీపి ఘన విజయం సాధించగా, ఈసారి ఆయన వలననే ఘోరంగా ఓడిపోయిందనేది వాస్తవం. కానీ ఎవరో మోసం, అన్యాయం చేశారంటూ తన ఈ చివరి వైఫల్యాన్ని కూడా ఎవరికో అంటగట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు జగన్.
కానీ నారా లోకేష్ ఇందుకు పూర్తి భిన్నంగా అవమానాలు, ఓటమి నుంచి పట్టుదలగా పాఠాలు నేర్చుకొని, తనను తాను నిరూపించుకొని మంగళగిరిలో ఈసారి ఘనవిజయం సాధించారు.
జగన్, లోకేష్ రాజకీయ ప్రస్థానాలను నిశితంగా చూస్తే, ఇద్దరూ తమ తండ్రి, పార్టీల బలంతోనే రాజకీయాలలో నిలద్రొక్కుకున్నారని అర్దమవుతుంది. కానీ జగన్ ప్రస్థానం అంతా వక్రమార్గంలోనే సాగగా, నారా లోకేష్ ప్రస్థానం లొసుగులు లేని రాజమార్గంలో సాగింది.
విశ్వసనీయతకు మారుపేరని చెప్పుకునే జగన్, తెలంగాణలో వైసీపి నేతలు, కార్యకర్తలను నడిరోడ్డున వదిలేసి ఆంధ్రాకు వచ్చేశారు. ఈసారి ఎన్నికలలో వైసీపి ఓడిపోబోతోందని గ్రహించినప్పుడు, తాననే నమ్ముకున్న పార్టీ నేతలను, కార్యకర్తలను గాలికి వదిలేసి విదేశాలకు వెళ్ళిపోయారు.
కానీ నారా లోకేష్ బలమే పార్టీ కార్యకర్తలు. ఏ జిల్లాకు వెళ్ళినా వారిని పేరు పెట్టి పిలిచే అంత సత్సంబంధాలు, చనువు ఉన్నాయి. వారి సంక్షేమం కోసం టిడిపిలో అనేక ఏర్పాట్లు చేసి అమలు చేయిస్తున్నారు కూడా. యువగళం పాదయాత్ర చేసి జగన్ పాలనలో వైసీపి నేతల వేధింపులతో తల్లడిల్లిపోతున్న టిడిపి నేతలు, కార్యకర్తలకు ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు. వారిలో కొత్త ఉత్సాహం నింపి మీకు అండగా నేనున్నాననే నమ్మకం కలిగించారు.
జగన్ తండ్రి మరణించినప్పుడు శవరాజకీయాలు చేసి, ఓదార్పు యాత్రలతో పార్టీని నిర్మించుకుని, భూటకపు సమైక్యాంధ్ర, ప్రత్యేక హోదా ఉద్యమాలు చేస్తూ పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నించారు. కానీ నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేసి వివిద వర్గాల ప్రజల కష్టసుఖాలు, స్థానిక సమస్యలని అడిగి తెలుసుకుంటూ ప్రజలకు చేరువయ్యారు. టిడిపిని కూడా ప్రజలకు దగ్గర చేశారు. అందువల్లే ఆ సమయంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి విజయం సాధించగలిగింది. మళ్ళీ నేడు ఎన్నికలలో కూడా ఘన విజయం సాధించింది. .
జగన్ అక్రమాస్తుల కేసులలో జైలుకి వెళ్ళి బెయిల్పై బయటకు వచ్చి రాజకీయంగా పైకి ఎదిగారు. కానీ ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్స్ విలువ తెలుసుకోలేక రాక్షసపాలన సాగించి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకొని ఓడిపోయారు. ఇప్పుడు అవే కేసులలో మళ్ళీ జైలుకి వెళ్ళే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.
అదే… నారా లోకేష్ పట్టుదలగా ప్రయత్నించి ఈసారి తాను గెలవడమే కాకుండా తన పార్టీని కూడా గెలిపించుకుని మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు.
అంటే జగన్ ప్రస్థానం జీరో నుంచి మళ్ళీ జీరోకి చేరుకోబోతుంటే, నారా లోకేష్ జీరో నుంచి రియల్ లైఫ్ హీరోగా ఎదిగి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు.
ప్రతిపక్షంలో ఉండగానే తనని తాను నిరూపించుకున్న నారా లోకేష్, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రాబోయే ఈ 5 ఏళ్ళలో ఏ స్థాయికి ఎదుగుతారో చూడాలి.




