రాష్ట్ర విభజనతో చచ్చిపోయిన ఏపీ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రాణ ప్రతిష్ట చేయబోతున్నారా?అంటే అవుననే అనిపిస్తోంది.
ప్రజలు తమను ఎందుకు గెలిపించారో గుర్తించి వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి ఉంటే నేడు జగన్ ఇంత ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. కానీ చేయాల్సినవి చేయకుండా, చేయకూడనివన్నీ చేస్తూ నాలుగున్నరేళ్ళ పుణ్యకాలం గడిపేశారు.
ఇంత కాలం గడప గడపకు, సామాజిక సాధికార యాత్రలతో ప్రజల మద్యకు పంపించిన తన సొంత ఎమ్మెల్యేలను ఇప్పుడు అదే ప్రజల ముందు దోషులుగా నిలబెట్టడానికి వెనకాడటం లేదు. వారిని బలిపశువులుగా చేసి తాను రెండో ఛాన్స్ పొందాలని జగన్ భావిస్తున్నారని సిపిఐ నారాయణ వంటివారు చెపుతున్నారు.
జగన్ నిర్ణయాలు సహజంగానే వైసీపి ఎమ్మెల్యేలలో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. కానీ వారు తమ అధినేత మెప్పుకోసం ఇంతకాలం టిడిపి, జనసేన నేతలను తిట్టిపోశారు. నియోజకవర్గం స్థాయిలో రాజకీయంగా చాలా వేధించారు. కనుక వారికి ఆ రెండు పార్టీల తలుపులు మూసుకుపోయాయి. కానీ పార్టీ నుంచి బయటపడక తప్పని పరిస్థితి ఏర్పడింది.
సరిగ్గా ఇదే… ఏపీ కాంగ్రెస్ పునః ప్రాణ ప్రతిష్టకు అవకాశం కల్పిస్తోంది. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఏపీ రాజకీయాలలో ఎప్పుడూ వేలు పెట్టలేదు. కానీ ఆయన ఇటీవల ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అంశం గురించి మాట్లాడారు. అంటే ఏపీలో ఈ రాజకీయ పరిణామాలను కాంగ్రెస్ అధిష్టానం నిశితంగా గమనిస్తూనే ఉందని, పావులు కదుపబోతోందని అర్దమవుతుంది.
కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ షర్మిలని ఆంధ్రాకు పంపించి ఏపీ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ యాక్టివ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఒకవేళ ఆమె ఏపీ కాంగ్రెస్లో చేరితే ఆమెకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఇదివరకే చెప్పారు కూడా.
తెలంగాణలో ఆమె రాజకీయ ప్రయోగం విఫలమవడంతో ప్రస్తుతం రాజకీయ నిరుద్యోగిగా మారిపోయారు. కనుక ఆమె ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
ఇదే కనుక జరిగితే… ఏపీ కాంగ్రెస్లోకి వైసీపి నేతల వలసలు మొదలవవచ్చు. అయితే ఇప్పటికిప్పుడు ఏపీ కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయినా దానిలో చేరితే ఎమ్మెల్యే టికెట్లు, సీట్లు సంపాదించుకొనే అవకాశం ఉంటుంది. కనుక జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఏపీ కాంగ్రెస్ పార్టీకి పునః ప్రాణప్రతిష్ట చేస్తున్నారని భావించవచ్చు.




