జగన్ అక్రమాస్తుల కేసులు, పుణ్యమాని ఇప్పుడు సామాన్య ప్రజలకు న్యాయ సంబందిత విషయాలపై అవగాహన పెరిగింది. వివేకా హత్య కేసు పుణ్యమాని సీబీఐ విచారణ, హైకోర్టు, సుప్రీంకోర్టులలో పిటిషన్లు ఎలా వేయాలి? బెయిల్ సంబందిత అంశాలపై సామాన్య ప్రజలకు కొంత అవగాహన ఏర్పడింది.
జగన్ పాలనలో పోలీస్ కేసులు, అరెస్టుల పుణ్యమాని నోటీసులు, అరెస్ట్, ఎఫ్ఐఆర్, కస్టడీ, బెయిల్ వంటి అంశాలపై అవగాహన పెరిగింది.
ఇప్పుడు జగన్-షర్మిల ఆస్తుల గొడవలు పుణ్యమాని షేర్ మార్కెట్, వాటాల బదలాయింపులు, వాటి విదివిధానాల గురించి అవగాహన ఏర్పరచుకుంటున్నారు. ఇలా ఒక్క వైఎస్ కుటుంబమే ప్రజలకు ఇన్ని కొత్త విషయాలు నేర్పిస్తుండటం చాలా గొప్ప విషయమే.
అయితే ప్రజలకు ఇంత విజ్ఞానం పంచుతున్న వారే పరస్పరం ‘నీకు ఆ క్లాజ్ తెలీదా? నీకు ఈ పాయింట్ తెలీదా?”అని ప్రశ్నించుకుంటూ ప్రజలని అయోమయపరుస్తున్నారు.
సరస్వతి పవర్ కంపెనీలో తన వాటాలను బదిలీ చేయించుకోవడం ద్వారా తాను బెయిల్ షరతులను ఉల్లంఘించేలా చేసి అరెస్ట్ అయ్యేందుకు చెల్లి షర్మిల కుట్రలు పన్నుతోందని జగన్ వాదిస్తున్నారు. కనుక ఈ గొడవలలో చెల్లి కాదు తననే బాధితుడిగా గుర్తించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
అయితే వైఎస్ షర్మిల మళ్ళీ మీడియా ముందుకు వచ్చి తన అన్న జగన్ అబద్దం చెపుతున్నారని ఆరోపించారు. ఆమె ఏమన్నారంటే, “ఆ కంపెనీకి చెందిన రూ.32 కోట్ల విలువైన స్థిరాస్తుల మీద మాత్రమే ఈడీ యధాతధస్థితి కొనసాగించాలని ఆంక్షలు విధించింది తప్పితే షేర్లు, వాటాలు బదిలీపై ఈడీ ఎలాంటి ఆంక్షలు విధించలేదనే సంగతి జగన్కి తెలుసు.
అందువల్లే దానిలో నా వాటాగా షేర్లు నాకు బదిలీ చేసి ఇస్తానని ఒప్పంద పత్రంపై సంతకం చేసి ఇచ్చారు. అందుకే విజయమ్మకి దానిలో వాటాలు అమ్మారు కూడా. కంపెనీ షేర్లపై ఎటువంటి ఆంక్షలు లేనందునే అవి స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అవుతున్నాయని జగన్కి తెలుసు.
కానీ నేను తన బెయిల్ రద్దు చేయించి అరెస్ట్ చేయించేందుకే కంపెనీలో వాటాలు పంచమని అడుగుతున్నానంటూ మా అన్న జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్దాలు చెపుతున్నారు.
నా వాటా నాకు ఇవ్వకుండా ఎగవేస్తే ప్రజలలో అసహ్యించుకుంటారని, బెయిల్ రద్దు, అరెస్ట్ అనే కొత్త కధ అల్లి నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. మా అన్న తీరుని మా తల్లి విజయమ్మగారు తప్పు పడుతున్నారు కదా? కానీ తల్లి అని కూడా చూడకుండా ఆమెపై కూడా జగన్ బురద జల్లిస్తున్నారు. జగన్ తీరుని ప్రజలందరూ నిశితంగానే గమనిస్తున్నారని మరిచిపోతే ఎలా?” అని షర్మిల అన్నారు.




