వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మాట తప్పడం, మడమ తిప్పడం కొత్తేమీ కాదు. అమరావతి రాజధానిగా వద్దనుకున్న జగన్ మళ్ళీ అమరావతికి జై కొట్టడమే తాజా ఉదాహరణ!
ఇప్పుడు శాసనసభ సమావేశాలకు హాజరయ్యే విషయంలో కూడా జగన్ మడమ తిప్పబోతున్నట్లున్నారు. రేపటి నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి.
కనుక తమ అధినేతకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే శాసనసభ సమావేశాలకు హాజరుకారని సజ్జల చేత, సొంత మీడియా చేత ముందే చెప్పించేశారు. కనుక శాసనసభ సమావేశాలకు హాజరుకానప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలతో సమావేశం కానవసరం కూడా ఉండదు.
కానీ రేపు (గురువారం) తాడేపల్లి ప్యాలస్లో జగన్ ఎమ్మెల్యేలతో సమావేశం కాబోతున్నారు. శాసనసభలో చర్చించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించబోతున్నట్లు ఆయన సొంత మీడియా తెలియజేసింది.
కనుక జగన్ హోదా విషయం పక్కనపెట్టి శాసనసభకు హాజరుకాబోతున్నారా? లేదా 10 మంది ఎమ్మెల్యేలను పంపించబోతున్నారా?అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
ఒకవేళ తానే ఎమ్మెల్యేలని వెంటబెట్టుకొని వస్తే టీడీపితో సహా అందరూ స్వాగతిస్తారు. కానీ తాను రాకుండా ఎమ్మెల్యేలను పంపిస్తే ‘ఆపరేషన్ సక్సస్ బట్ పేషంట్ డెడ్’ అన్నట్లవుతుంది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ శాసనసభ సమావేశాలకు వెళ్ళకుండా ఎమ్మెల్యేలను పంపిస్తున్నారు. అందుకు ఆయన ఏవిదంగా విమర్శల పాలవుతున్నారో ఆదేవిదంగా జగన్ కూడా విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో మంచి రాజకీయ, పరిపాలన అనుభవం ఉన్న హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి వంటివారున్నారు. కనుక వారు సభలో సిఎం రేవంత్ రెడ్డిని, మంత్రులను చాలా ధీటుగా ఎదుర్కొంటున్నారు. కానీ వైసీపీ ఎమ్మెల్యేలలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అచ్చన్నాయుడు వంటి మంత్రులను ధీటుగా ఎదుర్కోగలవారు ఒక్కరు కూడా లేరు.
కనుక జగన్ రాకుండా వారిని శాసనసభ సమావేశాలకు పంపించడమంటే బలి పీఠం ఎక్కిస్తున్నట్లే! పాపం వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ మాట అవుననలేరు.. కాదనలేరు!
ఇదేమీ కాదు… రేపటి సమావేశం కేవలం రాజకీయ కాలక్షేపం కోసం కావచ్చు లేదా మీడియా కవరేజ్ కోసం కావచ్చు. ఏది ఏమైనప్పటికీ, జగన్ శాసనసభకు వచ్చినా రాకపోయినా, తన ఎమ్మెల్యేలని మాత్రమే పంపించినా విమర్శలు మాత్రం తప్పవు.
పైగా తమని జగన్ బలి పశువులుగా మార్చి వాడుకుంటున్నారని ఎమ్మెల్యేలు భావిస్తే, జగన్కి గుడ్ బై చెప్పేసి కూటమిలో చేరిపోయినా ఆశ్చర్యం లేదు. కనుక జగన్ మడమ తిప్పకుండా ఉండటమే మంచిది.
ఎప్పటిలాగే తాడేపల్లి ప్యాలస్లో ప్రెస్మీట్ పెట్టుకొని శాసనసభ సమావేశాలపై రన్నింగ్ కామెంటరీ ఇచ్చినా అది ప్రజలకు కూడా అలవాటు అయిపొయింది కనుక వాళ్ళు కూడా ఏమీ అనుకోరు!






