ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతీ రాజకీయ నాయకుడు చెప్పే మాటే ఇది. జగన్ కూడా ఇప్పుడు ప్రతీరోజూ నేను అధికారంలోకి వస్తే.. అంటూ తాను ఏమేమి చేయబోతున్నారో చెపుతున్నారు.
మళ్ళీ సంక్షేమ పధకాలు అమలుచేస్తానని, సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఉన్నతాధికారులతో సహా అందరి భరతం పడతానని, వి నేతలను జైలుకి పంపిన పోలీస్ అధికారుల చేతే వారికి సెల్యూట్ కొట్టిస్తానంటూ చాలా చెపుతున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పధకాలు, రాజకీయకక్ష సాధింపులు తప్ప మరో ఆలోచన చేయని జగన్, సిఎం చంద్రబాబు నాయుడు పాలనలో ప్రతీ రంగం భ్రష్టు పట్టిపోతోందని, రాష్ట్రం సర్వనాశనం అయిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తుండటం విశేషం.
నాడు తాను చేసిన తప్పులు, పాపాలు అన్నిటినీ మరిచిపోయిన్నట్లు జగన్ మాట్లాడుతున్నారు. సరే.. అధికారంలో లేనప్పుడు ఏ రాజకీయ నాయకుడైన ఇలాగే మాట్లాడుతారని సరిపెట్టుకున్నా, మళ్ళీ తాను అధికారంలోకి వస్తానని జగన్ అంత గట్టిగా ఎలా నమ్ముతున్నారో అర్దం కాదు.
గత ఎన్నికలలో తిరుగులేని భారీ మెజార్టీతో గెలిచిన జగన్ ఈసారి అంతకంటే దారుణమైన స్థాయిలో ఓడిపోవడం మామూలు విషయం కానేకాదు.
ఒకవేళ జగన్ పాలన పట్ల ప్రజలలో అసంతృప్తి నెలకొని ఉందనుకున్నా వైసీపీకి కనీసం 30-40 సీట్లు గెలుచుకొని ఉండాలి.
ఉదాహరణకు 2019 ఎన్నికలలో జగన్ ప్రభంజనంలో కూడా ప్రజలు చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు ఇచ్చారు.
తెలంగాణలో కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పధకాలతో సంతృప్తి చెందిన ప్రజలు ఆయనకు 2023 ఎన్నికలలో 119కి 39సీట్లు ఇచ్చారే తప్ప 5-10 సీట్లు మాత్రమే ఇచ్చి తిరస్కరించలేదు.
కానీ 2024 ఎన్నికలలో ప్రజలు తనకి 175కి 175 సీట్లు ఇచ్చి నెత్తిన పెట్టుకుంటారని జగన్ అనుకుంటే కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. అంటే ఆయన పాలన, ధోరణి పట్ల ప్రజలలో ఎంత వ్యతిరేకత ఏర్పడిందో అర్దం చేసుకోవచ్చు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి 9 నెలలు కూడా పూర్తికాక మునుపే అమరావతి, పోలవరంతో సహా రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులు మొదలుపెట్టారు. లక్షల కోట్ల పెట్టుబడులతో ఎక్కడికక్కడ పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి.
ఇక ఎన్డీఏలో టీడీపీ చేరిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య సంబంధాలు చాలా బలపడ్డాయి. ముఖ్యంగా ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు కీలకంగా మారారు.
జగన్ అక్రమాస్తులు, వివేకా హత్య, మద్యం కుంభకోణంతో సహా పలు కేసులతో కదలికలు తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. అందుకే విజయసాయి రెడ్డి పార్టీని వీడి బయటకు వెళ్ళిపోయారని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నిన్నే చెప్పారు.
ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడితో విభేదించి, కూటమిని వీడి బయటకు వస్తారని, అప్పుడు కూటమిని చావు దెబ్బ తీయవచ్చని జగన్ పగటి కలలు కంటున్నారు.
కానీ మరోసారి చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి కావాలని, ఆయన నాయకత్వంలో పనిచేస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అంటే వచ్చే ఎన్నికల నాటికి కూటమి, ప్రభుత్వం మరింత బలపడతాయే తప్ప బలహీనపడవని స్పష్టమవుతోంది.
ఇవన్నీ వైసీపీకి ప్రతికూల అంశాలని అర్దమవుతూనే ఉంది. కనుక రాష్ట్రంలో వైసీపీ మళ్ళీ ఏవిదంగా అధికారంలోకి వస్తుందో చెప్పాల్సిన బాధ్యత జగన్పైనే ఉంది. లేకుంటే 175/175 పాటతో ప్రజలను, పార్టీ నేతలను, కార్యకర్తలని మభ్యపెట్టి గోతిలో పడేసిన్నట్లే, మళ్ళీ మనమే పాటతో మభ్యపెడుతున్నారని భావించక తప్పదు.




