పవన్ లక్ష్యం గురి తప్పిందా.? గురి తప్పిస్తున్నారా.?

Pawan Kalyan Speech

నిన్న పిఠాపురం వేదికగా జరిగిన జనసేన 12 వ ఆవిర్భావసభ లో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించిన తీరు అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. తన పార్టీ 11 ఏళ్ళ ప్రయాణం, తన పాతికేళ్ల భవిష్యత్ ప్రస్థానం గురించి జనసైనికులతో పాటుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా వివరిస్తారు అనుకున్న వారందరికీ పూర్తి నిరాశే ఎదురయ్యింది.

పదేళ్ల జనసేన పోరాటాలు, దశబ్దకాలపు పవన్ కు ఎదురైనా అవమానాలు అన్నిటికి బదులు చెప్పేలా 2024 లో జనసేన 100 % స్ట్రైక్ రేట్ తో దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకోగలిగింది. అలాగే డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ గా పవన్ కు ప్రమోషన్ దక్కింది. అంతటి ఘన విజయం తరువాత జరుగుతున్న పార్టీ ఆవిర్భావ సభ కావడంతో పవన్ ఈ సభ ద్వారా ప్రజలకు, తన పార్టీ నేతలకు ఎం సందేశం ఇవ్వబోతున్నారు అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ADVERTISEMENT

అలాగే తనను, తన కుటుంబాన్ని, తన వ్యక్తిగత జీవితాన్ని దశాబ్దం పాటు బజారున పెట్టిన వైసీపీ కి ఎటువంటి కౌంటర్ ఇస్తారు అనేది కూడా జనసైనికులలోతీవ్ర ఉచ్చుకత రేపింది. అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాను లేవనెత్తిన సమస్యలు, అధికార పక్షంలోకి వచ్చాక తాను పరిష్కారించిన సమస్యల పై ఎటువంటి ప్రకటనలు చేయలేదు పవన్.

కూటమి ప్రభుత్వంలో భాగమైన జనసేనాని ఈ తొమ్మిది నెలలలో రాష్ట్రానికి చేసిందేమిటి.? రాజధాని అమరావతి పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి ఏమిటి.? ఎన్డీయేలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి సాధించిన నిధులు, అలాగే కూటమి అధికారంలోకి వచ్చాక వచ్చిన పెట్టుబడులు, రాబోతున్న పరిశ్రమల ఊసే లేదు.

అలాగే ఉప ముఖ్యమంత్రి తో పాటుగా తాను బాధ్యతలు చేపట్టిన ఐదు మంత్రిత్వ శాఖల మీద, ఆయా శాఖల ద్వారా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు చేకూరిన ప్రయోజనాల మీద పిసరంతైనా వివరణ ఇవ్వలేదు. పంచాయితీ రాజ్ శాఖ తో పవన్ చేసిన అభివృద్ధి పనులను అసెంబ్లీ వేదిక గా తోటి మిత్ర పక్ష సహచర మంత్రులు ఇచ్చిన పాటి వివరణ కూడా పవన్ తన సభలో ఇవ్వలేకపోయారు.

గత పాలకుల అరాచకాలను, ఇప్పటి ప్రభుత్వ అభివృద్ధిని ప్రజల ముందు ఆవిష్కారించడంలో పవన్ పూర్తిగా విఫలమయ్యారనిపిస్తుంది. తన సొంత నియోజకవర్గమైన పిఠాపురం వేదికగా సభను నిర్వహించిన పవన్ కనీసం ఈ తొమ్మిది మాసాలలో తన నియోజకవర్గానికి తాను చేసిన అభివృద్ధి ఏమిటో.? చేయబోతున్న పనులేమిటో కూడా చెప్పుకోలేకపోయారు.

కేవలం జనసేనాని మీద ఒక ఆంగ్ల పత్రిక రాసిన వ్యతిరేఖ కథనానికి కౌంటర్ ఇవ్వడానికే మాత్రమే ఆవిర్భావ సభ నిర్వహించారా అన్నట్టుగా తన ప్రసంగాన్ని కొనసాగించారు పవన్. దానికి తోడు జనసేన ఆవిర్భావసభలో బీజేపీ విధానాలను, మోడీ షాల నినాదాలను బలంగా వినిపించడంలో శ్రద్ద కనపించారే తప్ప జనసేన సిద్దాంతాలను, ఆ పార్టీ భవిష్యత్ లక్ష్యాలను పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయలేకపోయారు.

హిందీ భాష నినాదం అనేది కేంద్ర ప్రబుత్వంలో ఉన్న బీజేపీ తీసుకున్న నిర్ణయం. దానిని ప్రజలలోకి తీసుకెళ్లే బాధ్యత ఆ పార్టీ నేతల పై ఉంటుంది. అయితే బీజేపీకి మిత్ర పక్ష పార్టీగా కొనసాగుతున్న జనసేన అందుకు తన మద్దతు తెలియచేస్తే సరిపోతుంది. అంతేకాని బీజేపీ నిర్ణయాల కోసం పొరుగు రాష్ట్రాల అధినేతల మీద విమర్శలు చేసి, వారి ప్రభుత్వాలకు కౌంటర్లు వేసి తన పార్టీకి, ఏపీ రాష్ట్రానికి కొత్త శత్రువులను సృష్టించుకోవాల్సిన అవసరం పవన్ కు లేదు.

కానీ పవన్ బీజేపీ నిర్ణయాలను తన భుజాన వేసుకుని జనసేన పార్టీకి అతి ముఖ్యమైన సభలో తన పార్టీ నినాదాలను పక్కన పెట్టి మరి బీజేపీ విధానాల గురించి చెప్పుకొచ్చారు. దీనితో పవన్ లక్ష్యం గురితప్పిందా.? లేక ఎవరైనా తప్పిస్తున్నారా.? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories