జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం రాత్రి విశాఖపట్నం నడిబొడ్డున జగదాంబ జంక్షన్ వద్ద బహిరంగసభ నిర్వహిస్తే వేలాదిగా జనాలు తరలివచ్చారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ సిఎం జగన్మోహన్ రెడ్డిని ప్రజల సొమ్ము దోచుకొంటున్న దోపిడీ దొంగ అని, ప్రభుత్వ భూములు, కొండలు, గుట్టలు, ఇసుక, మట్టి, మద్యం అన్నిటినీ తన గుప్పిట్లో పెట్టుకొని దోచుకొంటున్న ఓ దురాశపరుడైన వ్యాపారి అంటూ చాలా తీవ్ర ఆరోపణలు చేశారు.
అధికారులను, వాలంటీర్లను తన నేరాలలో భాగస్వాములుగా మార్చేసి వారిని కూడా తనతో పాటు జైలుకి తీసుకువెళ్ళబోతున్నారన్నారు. పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో పదేపదే సిఎం జగన్మోహన్ రెడ్డిని మంత్రులను అవినీతిపరులు, అసమర్దులు, రాష్ట్రాన్ని దోచుకొంటున్న దొంగలని ఆక్షేపించారు.
ఊహించినట్లే విశాఖ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే సిఎం జగన్మోహన్ రెడ్డిని, మంత్రులను దొంగలు, అవినీతిపరులు అని ఆరోపించినందుకు కాదు… జగదాంబ జంక్షన్ వద్ద బహిరంగసభలో తమ నిబందనలు లేదా ఆంక్షలను ఉల్లంఘించినందుకు!
ముఖ్యమంత్రిని, మంత్రులను పేరుపెట్టి ఇంత తీవ్రమైన ఆరోపణలు చేయడం కంటే బహిరంగసభలో నిబందనలు ఉల్లంఘించడమే పెద్ద నేరం అన్నట్లుంది.
పుంగనూరు అల్లర్లకు చంద్రబాబు నాయుడు కారకుడు అంటూ ఆయనపై ఏకంగా హత్యానేరం కింద కేసులు నమోదు చేశారు. కానీ ముఖ్యమంత్రి, మంత్రులను బహిరంగసభలో ఇంత తీవ్రంగా విమర్శించినా పవన్ కళ్యాణ్పై కేసులు పెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం వెనకాడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
“దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి… జైల్లో పెట్టుకోండి,” అంటూ పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వానికి సవాళ్ళు కూడా విసురుతున్నారు. నిన్న జగదాంబ జంక్షన్లో మాట్లాడుతూ “జగన్తో సహా మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి చిట్టా కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంది… కేంద్రం సాయంతో మీ అందరినీ ఓ ఆట ఆడిస్తానంటూ…ఎవరైనా మాజోలికి వస్తే తాట తీస్తానంటూ” పవన్ కళ్యాణ్ గట్టిగా హెచ్చరించారు.
మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందిస్తూ, “మా మీద ప్రధానికే ఫిర్యాదు చేస్తావో లేక అమెరికా అధ్యక్షుడు జోబైడెన్కే ఫిర్యాదు చేస్తావో, పుతిన్కే చేస్తావో నీ ఇష్టం…” అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు తప్ప పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేస్తామని చెప్పలేకపోయారు.
ఇదివరకు పవన్ కళ్యాణ్ విశాఖకు వచ్చినప్పుడు పోలీసులతో హోటల్ గదిలో నిర్బందించి, బయటకు వెళ్ళనీయకుండా మళ్ళీ నేరుగా విమానంలో విజయవాడకు తిప్పి పంపించేశారు. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ సభలకు ఆంక్షలు విధిస్తున్నా అనుమతిస్తుండటం గమనిస్తే, ఆయనను టచ్ చేయడానికి వైసీపీ ప్రభుత్వం భయపడుతున్నట్లు కనిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ కూడా గతంలో మాదిరిగా ఆచితూచి మాట్లాడటం లేదు. జగన్ను పేరు పెట్టి మరీ చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఢిల్లీ పెద్దల అండలేకపోతే పవన్ కళ్యాణ్ ఇంత తీవ్రంగా మాట్లాడి ఉండరు. ఈవిషయం వైసీపీ నేతలకు కూడా బాగానే అర్దమైనట్లుంది. బహుశః అందుకే మాటకు మాటతోనే సరిపెట్టేస్తున్నట్లున్నారు.



