బిఆర్ఎస్, వైసీపీ, జనసేన మూడు పార్టీలలో మొదటి రెండు పార్టీలు ఎంతో శక్తివంతమైనవి. వాటి అధినేతలు రాష్ట్ర రాజకీయాలను శాశించారు. ఆ పార్టీలు, వాటి అధినేతలతో పోలిస్తే జనసేన, దాని అధినేత పవన్ కళ్యాణ్ ఇంకా తప్పటడుగులు వేస్తున్నట్లే భావించవచ్చు.
కానీ అంత ఘనాపాటీలున్న రెండు పార్టీలు ఆరు నెలల తేడాతో ఎన్నికలలో ఓడిపోగా, జనసేన 100 శాతం స్ట్రైక్ రేటుతో విజయం సాధించి ఏపీ ప్రభుత్వంలో భాగస్వామి అయ్యింది.
అపర చాణక్యుడు కేసీఆర్ ఫామ్హౌస్లో, సంక్షేమ యోధుడు జగన్ తాడేపల్లి ప్యాలస్లో అజ్ఞాతంవాసం చేస్తుంటే, ‘పిల్ల బచ్చా’ అని వారు ఈసడించిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా సచివాలయంలో ఉన్నారు.
మరో విశేషంఏమిటంటే ఘన చరిత్ర కలిగిన బిఆర్ఎస్ పార్టీ, వైసీపీ రెండూ ఓటమి భారంతో క్రుంగిపోతూ మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తూ పార్టీ ఆవిర్భావ సభలు జరుపుకుంటుంటే, జనసేన సగర్వంగా విజయోత్సవంతో రేపు పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ జరుపుకోబోతోంది.
జనసేన పార్టీ ఈ దశకు చేరుకోవడానికి పూర్తి క్రెడిట్ పవన్ కళ్యాణ్కి మాత్రమే దక్కుతుందని చెప్పక తప్పదు. పార్టీని స్థాపించిన తర్వాత దాని నిర్వహణ కోసం పవన్ కళ్యాణ్ సినిమాలు చేయవలసి వచ్చింది. ఆ తర్వాత రాజకీయంగా కొన్ని తప్పటడుగులు వేసి ఎదురు దెబ్బల నుంచి అనేక రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు.
వైసీపీ హయాంలో జగన్, మంత్రులు చేసిన అవహేళనలకు మరొకరైతే పార్టీని మూసేసి, రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి పారిపోయేవారే. కానీ పవన్ కళ్యాణ్ చాలా ఓర్పుగా ఆ అవమానలను భరించారు. వాటిపై చాలా హుందాగా స్పందించారు.
ముఖ్యంగా టీడీపీతో పొత్తులు, సీట్ల సర్దుబాట్ల విషయంలో పవన్ కళ్యాణ్ చాలా రాజకీయ పరిపక్వత, దూరదృష్టితో వ్యవహరించారు. ఆయన నిర్ణయాలు జనసేనలో, కాపు సామాజిక వర్గంలో, ముఖ్యంగా జగన్కి నచ్చకపోయినప్పటికీ తీసుకున్న నిర్ణయానికి పవన్ కళ్యాణ్ గట్టిగా కట్టుబడి ఉన్నారు.
ఆ నిర్ణయమే.. జనసేనకు వరంగా మారింది. ఏపీ రాజకీయాలలో పెను మార్పుకి దారి తీసింది. ప్రభుత్వం మారేలా చేసింది. కనుక జనసేన ఆవిర్భావదినోత్సవం సంతోషంగా, అట్టహాసంగా జరుపుకోవడానికి హక్కు సంపాదించుకుంది.




