వచ్చే ఏపీ ఎన్నికలు ఇటు చంద్రబాబుకు అటు పవన్ కళ్యాణ్ కు చాలా కీలకం. తమ ప్రభావం కనీస స్థాయిలో కూడా చూపించలేకపోతే.. జనసేనకే కాదు, తెలుగు దేశానికీ కూడా మనుగడ కష్టం అవుతుంది. అందుకే జనసేన, తెలుగుదేశం కలిసి పని చేయాలని బాబు ఇప్పటికే ఇన్ డైరెక్ట్ గా పవన్ కి సిగ్నల్స్ పంపాడు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.
కానీ, జగన్ ను ఏ ఒక్క పార్టీ ఓడించలేదనే అభిప్రాయం ఇటు నాయకుల్లోనే కాదు, అటు ప్రజల్లోనూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ సోలోగా పోటీ చేస్తే మళ్లీ పరువు పోగొట్టుకునే అవకాశం ఉంది. ఇవన్నీ పవన్ కళ్యాణ్ మనసులో పెట్టుకుని, అప్పుడే ఒక కన్ క్లూజన్ కు రావాలని టీడీపీ సానుభూతిపరులు కోరుతున్నారు. మరోపక్క కొన్ని ఏరియాల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలనే డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది.
మరి జనసేన – టీడీపీ కలిసి పనిచేస్తాయా ? మరోపక్క సీఎం జగన్ రోజురోజుకూ బలహీనపడుతున్నాడని ట్రెండ్ ను బట్టి అర్ధమవుతుంది. రాజధాని వివాదం.. వైఎస్ వివేకా హత్య , గ్రౌండ్ లెవల్ అవినీతి, పథకాల్లో జరుగుతున్న లొసుగులు జగన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నాయి. ఇక భీమ్లానాయక్, సినిమా టికెట్ల వివాదంలో జగన్ ధోరణి పై జనసైనికులు గుర్రుగా ఉన్నారు.
ఎలాగూ ప్రజల్లో రోజురోజుకు అసంతృప్తి ఎక్కువ అవుతుంది. కాబట్టి అందరూ కలిసికట్టుగా పోతే.. జగన్ కి గట్టి పోటీ ఇవ్వొచ్చు. పైగా జనసేనతో పొత్తుకు టీడీపీ వర్గాలు కాస్త ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి. తమను కోరుకుంటున్నారు కాబట్టి.. జనసేన దాదాపు సగం సీట్లు ఆశిస్తోంది అని టాక్ ఉంది. ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉంది కాబట్టి.. ఈ లోపు మరింతగా బలపడాలని పవన్ భావిస్తున్నారు.
పార్టీ బలపడితే.. పొత్తులో బలమైన పాత్ర పోషిస్తే.. ఆశించిన సీట్లు వస్తాయని జనసేన మేధావి వర్గం కూడా అంచనా వేస్తోంది. కాకపోతే, జనసేనలో మరో వర్గం మాత్రం పొత్తు పెట్టుకుంటే టీడీపీకే ఎక్కువ లాభం అని, జనసేనకు కొత్తగా కలిసి వచ్చేది ఏముండదు అని, పెద్దపార్టీ అనే పేరుతో, పెద్ద దిక్కు అనే నినాదంతో సీఎం సీటును బాబు లాక్కుంటాడు అని వాదిస్తున్నారు.
ఇక బాబు సీఎం అయితే, మళ్లీ వ్యవహారం మొదటికే వస్తోంది అని.. అందుకే జనసేనతో టీడీపీ పొత్తు పవన్ కంటే.. బాబుకే ఎక్కువ లాభం అని జనసేన నాయకులు అభిప్రాయపడుతున్నారు. మరి పవన్ ప్రయాణం ఎటువైపు వెళ్తుందో చూడాలి. ఒక్కటి మాత్రం స్పష్టంగా తెలుస్తోంది, జనసేన – టీడీపీ కలిస్తే కచ్చితంగా జగన్ కి నష్టం జరుగుతుంది.



