తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై అపోలో డాక్టర్లు ఎలాంటి అధికారిక హెల్త్ బులిటెన్ లు విడుదల చేయకపోవడంతో… పలు అనుమానాలు చెలరేగిన విషయం తెలిసిందే. దీనికి తోడు గవర్నర్ విద్యాసాగరరావు స్వయంగా అపోలో హాస్పిటల్ కు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో జయలలితను చూసిన తర్వాత గవర్నర్ తాజా సమాచారం ఇస్తారని భావించగా, ఎలాంటి ప్రకటన చేయకుండా విద్యాసాగరరావు వెళ్ళిపోవడం మరింత ప్రాధాన్యతను దక్కించుకుంది.
అయితే తాజాగా జయలలిత ఆరోగ్యానికి సంబంధించి రాజ్ భవన్ నుండి ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదలైంది. అపోలో హాస్పిటల్ చైర్మెన్ తో జయలలిత ఆరోగ్యం గురించి గవర్నర్ అడిగి తెలుసుకున్నారని, జయలలిత ఆరోగ్యం మెరుగుపడుతోందని, చికిత్స అందిస్తున్న విధానం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ… డాక్టర్లను అభినందించారని, అలాగే జయలలితను పరామర్శించి, పండ్లు ఇచ్చి త్వరగా కోలుకోవాలని చెప్పినట్లుగా ఈ లేఖలో పేర్కొన్నారు.
అయితే ఎప్పుడో వచ్చే గవర్నర్ కార్యాలయం నుండి సమాచారం వచ్చిన నేపధ్యంలో… హాస్పిటల్ లోనే నిత్యం చికిత్స అందిస్తున్న డాక్టర్లు ఎందుకు హెల్త్ బులిటెన్ విడుదల చేయడం లేదన్నది ప్రశ్నార్ధకంగా మారింది. అయితే మరో పక్కన సోషల్ మీడియాలో జయలలితపై పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి. ఢిల్లీ నుండి అత్యంత రహస్య సమాచారం వచ్చిందంటూ వాట్సప్ తదితర సోషల్ మీడియా మాధ్యమాలలో గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.




