“మళ్లీ రావా, జెర్సీ” లాంటి సినిమాలతో కల్ట్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నాడు గౌతమ్ తిన్ననూరి. “జెర్సీ”తో ఏకంగా ఇంటర్నేషనల్ రికగ్నిషన్ తెచ్చుకున్న గౌతమ్ కి ఆ తర్వాత మాత్రం ఎందుకో చెప్పుకోదగ్గ విజయం లభించలేదు. “జెర్సీ” హిందీ రీమేక్ తోనే తప్పటడుగు వేశాడు.
అప్పటికి రీమేకులు వర్క్ అవ్వడం మానేయడంతో వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన హిందీ జెర్సీ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత భారీ అంచనాల నడుమ విడుదలైన “కింగ్డమ్” కూడా పేలవమైన కథ-కథనాలతో అలరించలేక బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. నిర్మాత నాగవంశీ తర్వాత ఇంటర్వ్యూల్లో ఆ సినిమా గురించి మాట్లాడుతూ.. “గౌతమ్ కి చాలా చెప్పాం కొన్ని మార్చమని, జెర్సీ తీసిన దర్శకుడితో ఎంతని వాదించగలం?” అని సింపుల్ గా ఆ సినిమా ఫెయిల్యూర్ తాలూకు క్రెడిట్ మొత్తం గౌతమ్ ఖాతాలోకే తోసేసాడు.
ప్రస్తుతం గౌతమ్ రెండేళ్ళ క్రితం తీసిన “మ్యాజిక్” ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని సంక్షోభంలో ఉంది. ఆ సినిమా షూటింగ్ మొత్తం పూర్తైపోయినా.. అనిరుధ్ బీజీయం ఇవ్వకపోవడంతో, ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అనేది గౌతమ్ కానీ నాగవంశీ కానీ చెప్పలేకపోతున్నారు.
ఇక కొత్తగా ప్రఖ్యాత గాయని ఎం.ఎస్.సుబ్బలక్ష్మి బయోపిక్ ను గౌతమ్ తెరకెక్కిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. మొదట ఈ సినిమాలో సాయిపల్లవి టైటిల్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పారు. తాజా సమాచారం ప్రకారం, సాయిపల్లవి ప్లేస్ లో రుక్మిణి వసంత్ వచ్చిందని తెలుస్తోంది. సాయిపల్లవి “రామాయణ్” ప్రమోషన్స్ లో బిజీగా ఉంటుంది కాబట్టి, ఆమె స్థానంలో రుక్మిణి వసంత్ ను తీసుకున్నారని, త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని ఫిలిం నగర్ వర్గాల భోగట్టా.
మరి దర్శకుడిగా “జెర్సీ” క్రెడిబిలిటీతోనే ఇంకా నెట్టుకొస్తున్న గౌతమ్ తిన్ననూరి, సుబ్బలక్ష్మి బయోపిక్ తో తన సత్తాను చాటుకుంటాడా? “జెర్సీ”తో గౌతమ్ ను నెత్తిన పెట్టుకున్న ప్రేక్షకులు, “కింగ్డమ్” తర్వాత గౌతమ్ ను మరోసారి నమ్ముతారా? వంటి ప్రశ్నలకి కాలమే సమాధానం చెప్పాలి.







