హాట్ హాట్ గా జరుగుతున్న నంది అవార్డుల చర్చలలో పలు ఆసక్తికరమైన అంశాలు బయటకు వస్తున్నాయి. ఓ ప్రముఖ మీడియా ఛానల్ నిర్వహించిన వేదికలో పాల్గొన్న ‘మెగా’ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్, ఈ అవార్డుల వెనుక ఉన్నది బాలకృష్ణ ఒక్కరేనని స్పష్టంగా చెప్పారు. జూరీ సభ్యులలో బాలకృష్ణ పేరు లేకపోయినా, ఈ మొత్తం కధకు శ్రీకారం చుట్టింది బాలయ్యేనని కుండబద్దలు కొట్టారు.
దీంతో ఇప్పటివరకు జరుగుతున్న రచ్చ ఎందుకోసమో అన్న విషయం సినీ ప్రేక్షకులకు కూడా తెలిసివచ్చింది. అయితే నిజంగా బండ్ల గణేష్ చెప్పినట్లుగా, ఈ అవార్డుల ప్రకటనలో బాలయ్య కీలక పాత్ర పోషించినట్లయితే 2016 ఏడాదికి గానూ “జనతా గ్యారేజ్” సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ కు అవార్డు ఎలా వచ్చింది? అన్నది శేష ప్రశ్నగా మిగులుతోంది.
బాలకృష్ణ ఫ్యామిలీ – జూనియర్ ఎన్టీఆర్ కుటుంబాల నడుమ ఉన్న “దూరం” బహిర్గతమే. మరి అలాంటి విభేదాలలోనూ జూనియర్ ఎన్టీఆర్ కు బాలకృష్ణ అవార్డును సిఫారసు చేస్తారా? ఇది నిజంగా జరిగే విషయమేనా? దీంతో ఈ రెండింటిలో ఒక్క విషయమే సత్యం అయి ఉండాలి. ఒకటి బండ్ల గణేష్ చెప్పినట్లుగా స్వయంగా బాలకృష్ణే యంగ్ టైగర్ కు అవార్డు ఇప్పించి ఉండాలి.
ఇది నిజమైతే… వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలు పచ్చి అబద్ధంగా పరిగణించాల్సి ఉంటుంది. మరి ఇందులో నిజానిజాలు ఏమిటో ప్రేక్షకులకు కూడా తెలిసిన విషయమే. అయితే బండ్ల గణేష్ వాదన ఏమిటంటే… గతంలో బాలయ్య – నాగ్ మధ్య ఉన్న విభేదాల కారణంగానే ‘మనం’ సినిమాను పక్కనపెట్టారని, అలాగే అక్కినేని కుటుంబ కధాచిత్రం పేరిట ఇచ్చే అవార్డును లేపేసారని స్పష్టంగా, బహిరంగంగా చెప్తున్నారు.
నిజానిజాలు ఎలా ఉన్నా… నంది అవార్డుల పేరుతో ఇండస్ట్రీలో ఉన్న “బొక్కలన్నీ” బయట పడుతున్నాయి. మీడియాకు కావల్సినంత పండగ… ప్రేక్షకులకు కావల్సినంత వినోదం…! చివరికి మిగిలేది అదే..!



