ఆంధ్రా పట్ల బీఆర్ఎస్ పార్టీ నేతలకి, వారి అధినేత కేసీఆర్కి ద్వేషం ఉందనే సంగతి వారంతట వారే తమ మాటల్లో బయటపెట్టుకుంటూనే ఉంటారు. ప్రస్తుతం కాళేశ్వరంతో సహా తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మద్య వాదోపవాదాలు సాగుతున్నాయి.
అది వారి రాష్ట్రానికి, ఆ రెండు పార్టీలకు సంబందించిన అంతర్గత వ్యవహారం కనుక దాని గురించి వ్యాఖ్యలు అనవసరం. అయితే దిగువనున్న ఆంధ్రాకు చుక్క నీరు వదలద్దనే హరీష్ రావు వాదన విన్నప్పుడు, బీఆర్ఎస్ నేతలలో ఆంధ్రా పట్ల ఎంత ద్వేషభావం ఉందో అర్ధమవుతుంది. ముందుగా ఆయనేమన్నారో చూద్దాం.
“గోదావరిలో రోజుకి 50-60 వేల క్యూసెక్కుల నీళ్ళు ప్రవహిస్తుంటే కన్నెపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టులలో అన్ని మోటార్లు ఆన్ చేసి రప్పారప్పా నీళ్ళు గుంజితే ఏపీలో పట్టిసీమకు ఒక్క చుక్క నీరు అందేది కాదు. కానీ మోటార్లు ఆన్ చేయకుండా దిగువకు నీళ్ళు వదిలేస్తూ, మీ గురువుగారికి గురుదక్షిణగా సమర్పించుకుంటున్నావు. ఈ మాటకి నేను కట్టుబడి ఉన్నా.
ఇన్ని ప్రాజెక్టులున్నా దేనినీ వాడకుండా తెలంగాణలో పొలాలను, చెరువులను ఎండబెడుతున్నావు. మేము గట్టిగా నిలదీసిన తర్వాతే దేవాదులలో పది మోటార్లు ఉంటే నాలుగు ఆన్ చేసి నీళ్ళు ఎత్తిపోస్తున్నావు. మిగిలినవి ఎందుకు ఆన్ చేయడం లేదు. మీ గురువుగారికి గురుదక్షిణ సమర్పించుకునేందుకే కదా?” అంటూ హరీష్ రావు సిఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.
వరద నీటిని తెలంగాణ ఉపయోగించుకోవాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ దిగువనున్న ఆంధ్రాకు చుక్క నీరు వదలకుండా వాడుకోవాలని అనుకోవడమే తప్పు.
కేసీఆర్ కూడా ఇలాంటి ఆలోచనతోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి చుక్క నీరు కిందకు వదలకుండా మొత్తం నీటిని దాచేసుకుందామని అనుకుంటే మేడిగడ్డ బ్యారేజ్ క్రుంగిపోయింది. అన్నారం, సుందిళ్ళ బీటలు వారాయి. ఆయన ఎంతో గొప్పగా చెప్పుకున్న కన్నెపల్లి పంప్ హౌస్ దానిలో భారీ మోటార్లు అన్నీ నీట మునిగాయి.
ఆయన దురాశతో గోదావరి నీటిని మొత్తం వాడేసుకుందామనుకున్నా ఆయన వల్ల కాలేదు. గోదావరి వరద పోటెత్తితే ఆంధ్ర కూడా ఉపయోగించుకున్నాక లక్షల క్యూసెక్కుల నీళ్ళు సముద్రం పాలవుతూనే ఉన్నాయి. అపర భగీరధుడినని చెప్పుకునే ఆయనే గోదావరి నీటిని ఆపలేకపోయినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఆపగలదు?
అందుకే రెండు రాష్ట్రాలు ఎంతగా నీళ్ళు వాడుకున్నా ఇంకా మిగులు జలాలు సముద్రంలో కలుస్తూనే ఉంటాయని, తెలంగాణలో గోదావరి మీద ఇంకా ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా మాకు అభ్యంతరం లేదని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పారు.
సిఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ కూడా గోదావరి నీటితో సస్యశ్యామలమవ్వలని కోరుకుంటే, బీఆర్ఎస్ నేతలు ఏపీకి చుక్క నీరు వదలద్దంటూ ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు.
గోదావరిలో పుష్కలంగా నీళ్ళున్నప్పుడు ఎందుకు తోడిపోయడం లేదని తమ ముఖ్యమంత్రిని అడగడంలో తప్పు లేదు. కానీ దిగువకు ఎందుకు విడిచిపెడుతున్నావు?చంద్రబాబు నాయుడు కోసమేనా? అని అడగడం తప్పు.
నీళ్ళ విషయంలో కేసీఆర్, హరీష్ రావులకు గొప్ప అవగాహన ఉంటే మంచిదే. కానీ దానిని ప్రజలను తప్పు దోవ పట్టించి విద్వేషాలు రగిలించేందుకు ఉపయోగించుకోవాలనుకోవడమే తప్పు! ఈవిధంగా నీళ్ళ రాజకీయాలు చేస్తూ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ది పొందాలనుకోవడం చాలా దుర్మార్గమే కదా?




