తెలంగాణ రాజకీయాలు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ తో పాటు బీజేపీ చుట్టూ కూడా తిరుగుతున్నాయి. కొన్నాళ్ళు సైలెంట్ గా మరికొన్నాళ్లు హడావుడిగా తెలంగాణ బీజేపీ తెలంగాణలో తన ఉనికిని కాపాడుకుంటూ వస్తుంది.
తెలంగాణ బీజేపీ లో రాష్ట్ర అధ్యక్ష పదవిలో వచ్చిన తాజా మార్పు ఆ పార్టీ భవిష్యత్ కార్యాచరణ, వాటి అమలు ఆధారంగా నాయకత్వ గుర్తింపు కోరుకుంటుంది. అయితే కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన రామ్ చందర్రావు మాట్లాడుతూ త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలలో పార్టీ గెలుపే ధ్యేయంగా అందరు పనిచేయాలంటూ పార్టీ క్యాడర్ కు లీడర్లకు పిలుపునిచ్చారు.
తెలంగాణలో బలమైన ప్రతిపక్షం ఉంటే అధికార పక్షానికి ఉపఎన్నికలలో విజయం అసాధ్యమని, ఆ దిశగా అందరు కలిసి కట్టుగా పార్టీ బలోపేతానికి నడుం బిగించాలంటూ, అందుకు పార్టీ అధ్యక్షుడిగా తనవంతు కృషి చేస్తానంటూ చెప్పుకొచ్చారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల మీద కూడా ఇక నుంచి బీజేపీ ద్రుష్టి పెడుతుందంటూ ప్రకటించారు.
ఈ ఉప ఎన్నికలలో బీజేపీ ని విజేతగా నిలబెట్టి తన నాయకత్వం మీద సొంత పార్టీలోనే వచ్చిన అపోహలను, అనుమానాలను తొలగించుకుని రాష్ట్ర నాయకుడిగా తగిన గుర్తింపు సంపాదించుకోవడానికి రామ్ చందర్ రావు తాపత్రయపడుతున్నారు.
అయితే ఇటు బిఆర్ఎస్ కూడా అధికార కాంగ్రెస్ కు తన సత్తా ఏంటో చూపించడానికి, ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో నిరూపించడానికి, పార్టీ భవిష్యత్ నాయకుడిగా కేటీఆర్ తనను తానూ నిరూపించుకోవడానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఒక ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అందుకు తగ్గట్టే తన రాజకీయ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు.
అందులో భాగంగానే మరుగున పడ్డ తెలంగాణ సెంటిమెంట్ ను బనకచర్ల తో మరోసారి తట్టి లేపే ప్రయత్నం చేస్తుంది బిఆర్ఎస్. అందుకు తగ్గట్టే ఏపీ ప్రభుత్వ నిర్ణయాల పైన, అక్కడి ముఖ్యమంత్రి చంద్రబాబు పైన రాజకీయ ఆరోపణలు చేస్తూ రెండు రాష్ట్రాల మధ్య నీటి చిచ్చు రాజేస్తోంది.
ఇక అధికార కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ప్రజలు తమ పాలన పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నారని, తెలంగాణలో గులాబీ కారుకి కాలం చెల్లిందని రుజువుచేయడానికి, ఆ పార్టీ నేతలను కట్టడి చేయడానికి, తెలంగాణ రాజకీయాలలో బీజేపీ పరిధిని పరిమితం చెయ్యడానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను లక్ష్యంగా తీసుకుంది.
ఈ ఎన్నికలలో కాంగ్రెస్ జయకేతనం ఎగరేసి రేవంత్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ప్రజా వ్యతిరేకత అనే ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నయాక్టవుమ్ మీద వస్తున్న ఆరోపాలకు చెక్ పెట్టడానికి కాంగ్రెస్ కూడా గట్టిగా ప్రయత్నం చేస్తుంది.
ఇలా ఒక్క ఉప ఎన్నిక మూడు పార్టీల బలానికి, బలగాన్ని, నాయకత్వ నిరూపణకు ప్రతీకగా మారింది. మరి జూబ్లీహిల్స్ లో జరగనున్న ఈ మూడు స్తంభాల ఆటలో గులాబీ కారు ట్రాక్ లోకి వస్తుందా.? కమల దళం వికసిస్తుందా.? లేక కాంగ్రెస్ హస్తం పై చేయి సాధిస్తుందా.? అనేది వేచి చూడాలి.




