తెలంగాణ సిఎం కేసీఆర్ గత 9 నెలలుగా రాజ్భవన్లో అడుగుపెట్టలేదు. గణతంత్రదినోత్సవం వంటి ముఖ్య సందర్భాలలో కూడా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలవలేదు. పైగా ఆమె బిజెపి నేతలాగ వ్యవహరిస్తున్నారని, తన పరిధిని అతిక్రమిస్తున్నారంటూ టిఆర్ఎస్ మంత్రులు విమర్శిస్తుంటే కేసీఆర్ వారిని వారించలేదు. అంటే కేసీఆర్ సూచన మేరకే వారు ఆమెపై విమర్శలు గుప్పించినట్లు భావించవచ్చు.
ఇక తన పర్యటనలలో తెలంగాణ ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించకపోవడంపై ఆమె కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాలకు ఫిర్యాదు చేశారు కూడా. రాజ్భవన్కు సీఎంవోకు మద్య ఏర్పడిన దూరం తగ్గించేందుకు తమిళిసై సౌందరరాజన్ చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో ఇక ఎప్పటికీ ఇదే పరిస్థితులు కొనసాగుతాయని అందరూ భావిస్తున్నారు.
ఇటువంటి సమయంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఈరోజు రాజ్భవన్లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరుకావలసి ఉంటుంది. కానీ సిఎం కేసీఆర్ హాజరవుతారా లేదా?అని అందరూ ఆసక్తిగా చూస్తుంటే, ఆయన తన మంత్రులు, ముఖ్యనేతలను వెంటబెట్టుకొని రాజ్భవన్కు వెళ్ళి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కి పూల బొకే అందించి పలకరించారు. ఆమె పక్కనే కూర్చొని ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు కూడా.
దీంతో జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణస్వీకారం కార్యక్రమం కంటే కేసీఆర్ రాజ్భవన్కు వచ్చి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ని పలకరించడమే ప్రధానవార్తగా మారింది. సిఎం కేసీఆర్ ఆమెను పలకరించి మాట్లాడారు కనుక ఆమె పట్ల కేసీఆర్ వైఖరిలో మార్పు వచ్చిందా లేక మొక్కుబడిగా పలకరించారా?అనేది రాబోయే రోజుల్లో క్రమంగా తెలుస్తుంది. అయితే సిఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో ఘర్షణ పడటం వలన ఆయన ప్రభుత్వానికే నష్టం, ఇబ్బండీ తప్ప ఆమెకు ఎటువంటి ఇబ్బందీ ఉండదని స్పష్టమైంది. పైగా ఇటువంటి సందర్భాలలో తప్పనిసరిగా ఆమె వద్దకే రాకతప్పదని స్పష్టమైంది. కనుక గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పట్ల సిఎం కేసీఆర్ ఇకపై కాస్త మృదువుగా వ్యవహరించే అవకాశం ఉంది.



