కేసీఆర్ తన హయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్లకు తనకీ ఎటువంటి సంబందమూ లేదని, వాటికి ఆయా అధికారులే పూర్తి బాధ్యత వహించాలని చెప్పేసి సింపుల్గా చేతులు దులిపేసుకున్నారు.
ఇప్పుడు ఆయన కొడుకు కేటీఆర్ ఫార్ములా 1 రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ, ఈడీ కేసులలో చిక్కుకున్నారు. ఆయన కూడా తండ్రి ఫార్ములానే పాటిస్తూ, ఈ కేసులో హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో, “తాను మంత్రిగా నిర్ణయం మాత్రమే తీసుకుంటానని, దానిని అమలు చేసేటప్పుడు పాటించాల్సిన సాంకేతిక, చట్టపరమైన, విధానపరమైన అంశాలను సంబందిత అధికారులే చూసుకోవలసి ఉంటుందని, అది వారి బాధ్యతే తప్ప మంత్రిగా తన బాధ్యత కాదని” కేటీఆర్ పేర్కొన్నారు.
“విదేశీ కంపెనీలతో హైదరాబాద్లో ఫార్ములా 1 రేసింగ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు, దానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు చూసుకోవలసిన బాధ్యత అధికారులదే తప్ప మంత్రిగా తనది కాదని కేటీఆర్ దానిలో పేర్కొన్నారు.
కనుక ఈ వ్యవహారంలో ఒకవేళ నిబంధనలు ఉల్లంఘన జరిగిన్నట్లయితే దానికి సంబందిత అధికారులే పూర్తి బాధ్యులని చెపుతూ కేటీఆర్ కూడా తండ్రి కేసీఆర్లాగే చేతులు దులిపేసుకున్నారు.
తప్పంతా అధికారులదేనని తండ్రీ కొడుకులు తేల్చి చెప్పేసి, తమ ఆదేశాలను అమలు చేసిన అధికారులను బలిపశువులుగా చేసి వారిరువురూ తప్పించుకోవాలని అనుకుంటున్నారన్న మాట!
ఓ ముఖ్యమంత్రి లేదా మంత్రిగా ఉన్న ఆయన కుమారుడు ఓ నిర్ణయం తీసుకొని తప్పనిసరిగా అమలు చేయాలని ఒత్తిడి చేస్తున్నప్పుడు ఏ అధికారైనా వారి ఆదేశాలను కాదనగలడా?
రేసింగ్ కోసం రూ.53 కోట్లు విదేశాలకు పంపాలని కేటీఆర్ హుకుం జారీ చేసినప్పుడు, సంబందిత అధికారులు, నియమ నిబంధనలు, దాంతో భవిష్యత్లో ఎదురయ్యే ఇటువంటి సమస్యలను ఆనాడు కేటీఆర్కి చెప్పకుండా ఉంటారా?అంటే చెప్పే ఉంటారు.
కానీ “ఎప్పటికీ మేమే అధికారంలో ఉండబోతున్నాం.. మాకు తిరుగే లేదు..” అనే గుడ్డి నమ్మకంతో ‘నా మాటే శాశనం… నేను చెప్పిన్నట్లు అమలుచేసి తీరాల్సిందే,’ అని ఆనాడు కేటీఆర్ అధికారులపై ఒత్తిడి చేయడం వల్లనే వారు నిబంధనలు ఉల్లంఘించేందుకు సాహసించారు.
ఒకవేళ కేసీఆర్, కేటీఆర్ ఒత్తిడి చేయకుంటే అధికారులు తప్పులు చేసేవారా? అంటే కాదనే అర్దమవుతోంది. కనుక పూర్తి బాధ్యత కేసీఆర్, కేటీఆర్లదే అవుతుంది కదా?




