కడప స్టీల్ ప్లాంట్‌కి డెడ్‌లైన్స్ పెట్టేశారుగా!

Kadapa Steel Plant

రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా తొలిసారిగా బాధ్యతలు చేపట్టినప్పుడే కడపలో కడప స్టీల్ ప్లాంట్‌ ఏర్పాటుకి సన్నాహాలు మొదలుపెట్టి శంకుస్థాపన కూడా చేశారు.

జగన్‌ అధికారంలోకి వచ్చాక 2019, డిసెంబర్ 23న మళ్ళీ శంకుస్థాపన చేసి ఈ ప్లాంటులో వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. జగన్‌ 5 ఏళ్ళ పాలన ముగిసింది కానీ కడప స్టీల్ ప్లాంట్ కాంపౌండ్ వాల్ కూడా నిర్మించలేదు. కడప స్టీల్ ప్లాంట్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోయింది.

ADVERTISEMENT

మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే కడప స్టీల్ ప్లాంట్‌పై దృష్టిపెట్టారు. ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన “జేఎస్‌డబ్ల్యూ కంపెనీ” ప్రతినిధులతో అనేకమార్లు చర్చలు జరిపి కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఒప్పించారు.

మొదటి దశలో రూ.4,500 కోట్లు పెట్టుబడితో 2026 జనవరి నుంచి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు జేఎస్‌డబ్ల్యూ కంపెనీ అంగీకరించింది. 2029 ఏప్రిల్ నుంచి ఈ ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభించాలనే ప్రభుత్వం షరతుకి జేఎస్‌డబ్ల్యూ కంపెనీ అంగీకరించింది.

మొదటి దశ నిర్మాణ పనులు పూర్తవగానే మరో రూ.11,850 కోట్లు పెట్టుబడితో 2031 జనవరిలో రెండో దశ నిర్మాణ పనులు మొదలుపెట్టి, 2034 ఏప్రిల్ నాటికి పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభిస్తామని జేఎస్‌డబ్ల్యూ కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

ఈ ప్లాంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కడప జిల్లా సున్నపురాళ్ళ పల్లెలో రూ.5 లక్షలు చొప్పున 1,100 ఎకరాలు కేటాయించింది.

ఈ తొలిదశ ప్లాంట్ నిర్మాణ సమయంలోనే సుమారు 1,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. నిర్మాణం పూర్తయి ఉత్పతి ప్రారంభమైతే సుమారు 2,500-3,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, మరికొన్ని వేలమందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.

జగన్‌లాగ సిఎం చంద్రబాబు నాయుడు మొక్కుబడిగా పనులు మొదలుపెట్టడం లేదు. ప్లాంట్ నిర్మాణ పనులు పూర్తి చేయడానికి, ఉత్పత్తి ప్రారంభించడానికి ముందే గడువు విధించారు.

మరో నాలుగేళ్ళ వరకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి కనుక అనుకున్న సమయం కంటే ముందుగానే కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.

ADVERTISEMENT
Latest Stories