ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఈరోజు అనూహ్యమైన మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్ట్ అయ్యి నాలుగు నెలలుగా తిహార్ జైల్లోనే ఉన్న కూతురు కల్వకుంట్ల కవితని విడిపించుకోవడానికి కేసీఆర్ తెర వెనుక చేయని ప్రయత్నాలు లేవు. ఆమె కూడా బెయిల్ కోసం పదేపదే ప్రయత్నిస్తున్నారు కూడా. కానీ ఇద్దరి ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆమె ఇంకా జైల్లోనే గడపాల్సి వస్తోంది.
అయితే ఇంతకాలం నానా రకమైన కుంటిసాకులతో తనకు బెయిల్ ఇమ్మనమని కోర్టుని అడుగుతున్న కల్వకుంట్ల కవిత, ఈరోజు ఆమె డీఫాల్ట్ బెయిల్పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరుపబోతుంటే తన బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకోవడం ఆశ్చర్యకరమే. ఆమె బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకున్నట్లు ఆమె న్యాయవాది కోర్టుకి తెలిపారు. దీంతో తనకు బెయిల్ అవసరం లేదని కల్వకుంట్ల కవిత కోర్టుకి చెప్పిన్నట్లయింది.
అలాగని తిహార్ జైల్లోనే చాలా సుఖంగా ఉందని, కనుక అక్కడే ఉండాలని ఆమె అనుకుంటున్నట్లు భావించలేము. కనుక ఆమె సుప్రీంకోర్టుని ఆశ్రయించబోతున్నారా లేదా కేసీఆర్ తెరవెనుక చేస్తున్న ప్రయత్నాలు ఫలించి ఏకంగా ఈ కేసు నుంచే ఆమెకు విముక్తి లభించబోతోందా?లేదా మరో మూడు రోజులలో ఇదే కోర్టులో జరుగబోయే సీబీఐ ఛార్జ్ షీట్ మీద జరుగబోయే విచారణలో తమ వాదనలకు ఈ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ అవరోదంగా మారుతుందని న్యాయవాదులు భావిస్తున్నారా? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభిస్తుంది.
కల్వకుంట్ల కవిత జైలుకి వెళుతున్నప్పుడు తాను కడిగిన ఆణిముత్యంలా బయటకు వస్తానని చెప్పారు. కనుక ఒకవేళ బిఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనం అయ్యి ఈ కేసు నుంచి విముక్తి లభిస్తే ఆమె కడిగిన ఆణిముత్యంలాగే బయటకు వస్తారు. అప్పుడు న్యాయం, ధర్మం గెలిచాయని ఆమె పిడికిలి బిగించి చెప్పుకోవచ్చు.
ఏది ఏమైనప్పటికీ బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కల్వకుంట్ల కవితకి బెయిల్పై విడుదలై బయటకు రాగలిగినా చాలా సంతోషమే. ఒకవేళ తెర వెనుక రాజీ కుదిరి కడిగిన ఆణిముత్యంలా బయటకు వస్తే అంతకంటే సంతోషం ఏముంటుంది?




