ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కవిత ఓ యువరాణిలా గౌరవం పొందేవారు. కానీ తండ్రి కేసీఆర్ని, పార్టీని విమర్శించినప్పటి నుంచి కేసీఆర్తో సహా బీఆర్ఎస్ పార్టీలో గల్లీ స్థాయి నాయకుడు కూడా ఆమెను పట్టించుకోవడం లేదు.
దీంతో ఒకప్పుడు తెలంగాణ రాజకీయాలలో షర్మిల ఏవిదంగా ఒంటరిగా తిరిగేవారో, ఇప్పుడు కల్వకుంట్ల కవిత కూడా తన సొంత గడ్డ మీద అలాగే ఒంటరిగా తిరుగుతున్నారు.
కానీ ఆమె ఏనాటికైనా పరిస్థితులు మారకపోతాయా… అనుకూలించకపోతాయా? అని ఆశగా ఎదురుచూస్తూ తెలంగాణ జాగృతి కండువా వేసుకొని రాజకీయాలు చేస్తున్నారు. బలం కూడగట్టుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
ఈప్రయత్నంలోనే సింగరేణి కార్మిక సంఘాలపై దృష్టి సారించారు. దసరా తర్వాత తాను సింగరేణిలో పర్యటిస్తానని, వామపక్షాలతో కలిసి హెచ్ఎంఎస్ (హిందూస్తాన్ మజ్దూర్ సంఘం)తో కలిసి సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో పోరాడుతానని చెప్పారు.
ఆమె బీఆర్ఎస్ పార్టీకి అనుబందంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆమెతో కలిసి ఫోటో దిగేందుకు కూడా ఎవరూ ఇష్టపడటం లేదు. కనుక వామపక్షాలు, హెచ్ఎంఎస్తో కలిసి పని చేస్తానంటున్నారు!
కానీ ఆమె పరిస్థితి, ఆమె రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో తెలీదు. కనుక ఆమె మాటలను నమ్మేందుకు ఎవరూ సిద్దంగా లేరు.
గతంలో ఆమె తండ్రి కేసీఆర్ అవసరమైనప్పుడు వామపక్షాలను వాడుకొని వదిలేశారు. కనుక ఇప్పుడు వామపక్షాలు ఆమె మాటలు నమ్మి బాసటగా నిలుస్తాయని అనుకోలేము.
కనుక కల్వకుంట్ల కవిత ఈవిదంగా అగమ్యంగా ఇంకా ఎంత కాలం రాజకీయ ప్రయాణం చేస్తారో? ఆమె గమ్యం ఏమిటో?ఆమెకే తెలీని పరిస్థితి కనిపిస్తోంది.
బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అత్యంత శక్తివంతురాలుగా కనిపించిన కల్వకుంట్ల కవిత, దాని నుండి బయటకు వస్తే ఇంత బలహీనంగా మారడం ఆశ్చర్యమే కాదు… ఆలోచింపజేస్తుంది కూడా.
రాజకీయాలలో కూడా మహిళలు ఎవరో ఒకరి అండదండలు లేకపోతే ఒంటరిగా రాణించలేరా?రాణించాలనుకుంటే సమాజం తోడ్పడదా?అనే సందేహం కలుగుతుంది.






