ప్రముఖ నటుడు కమల్ హాసన్ త్వరలో రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు. నిజానికి ఆయన స్థాయి వ్యక్తి ఎప్పుడో రాజ్యసభకు నామినేట్ అయ్యుండాలి. కానీ చాలా ఆలస్యంగానైనా పెద్దల సభలో అడుగుపెడుతున్నందుకు చాలా సంతోషమే.
కానీ ఆయన ఏ పార్టీలకి వ్యతిరేకంగా పోరాడేందుకు ఎంఎన్ఎం పార్టీ స్థాపించి తమిళనాడు రాజకీయాలలో ప్రవేశించారో అదే పార్టీ (డీఎంకె) మద్దతుతో రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు.
తమిళనాడులో దశాబ్ధాలుగా డీఎంకె, అన్నాడీఎంకెలు పాతుకుపోయి వాటి మద్యనే అధికార మార్పిడి జరుగుతోంది. ఆ కారణంగా వాటిలో అవినీతి, వారసత్వ రాజకీయాలు పెరిగిపోయాయని వాదిస్తూ కమల్ హాసన్ ఎంఎన్ఎం పార్టీతో తమిళనాడు రాజకీయాలలో ప్రవేశించారు.
ఓ గొప్ప నటుడుగా ఆయనకు తమిళ ప్రజలు నీరాజనాలు పడుతుంటారు. కానీ ఎన్నికలలో మాత్రం ఆయనని, పార్టీని పట్టించుకోకపోవడంతో చివరికి ఇండియా కూటమిలో జేరి వారసత్వ రాజకీయాలు చేసే కాంగ్రెస్, డీఎంకెలతోనే చేతులు కలిపారు.
2024 లోక్సభ ఎన్నికలలో ఎంఎన్ఎం పోటీ చేయకుండా ఆయన కాంగ్రెస్, డీఎంకె పార్టీలకి మద్దతు ప్రకటించింది. అందుకు ప్రతిగా కమల్ హాసన్కు రాజ్యసభ సీటు ఇచ్చేందుకు ఒప్పందం జరిగింది. ఆ ప్రకారమే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కమల్ హాసన్ని రాజ్యసభ అభ్యర్ధిగా ప్రకటించారు.
జూన్ 19న తమిళనాడులో 6 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరుగబోతున్నాయి. అధికార డీఎంకె పార్టీకి 134 మంది ఎమ్మెల్యేలునందున వాటిలో నాలుగు సీట్లు గెలుచుకోగలదు. వాటిలో ఓ సీటు కమల్ హాసన్కి కేటాయించింది.
కనుక కమల్ హాసన్ పెద్దల సభలో అడుగుపెట్టడం లాంఛనప్రాయమే. అయితే ఆయన సొంత బలంతో అడుగు పెట్టి ఉండి ఉంటే చాలా గౌరవంగా ఉండేది. కానీ తాను విమర్శించిన పార్టీ మద్దతుతో అడుగుపెట్టబోతున్నారు.
కమల్ హాసన్ స్థాయి ప్రముఖులందరూ రాజ్యసభలో ఉన్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంకా ఆలస్యం చేస్తే ఈ అవకాశం కూడా చేజారిపోతుంది. కనుక ఆయన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. దేశానికి, రాష్ట్రానికి గొప్ప పేరు తెచ్చిన కమల్ హాసన్ వంటి గొప్ప నటుడు రాజ్యసభలో ఉండాల్సినవారే!




