కేసీఆర్‌ గురించి కంచె ఐలయ్య చెప్పింది నాలుగు ముక్కలే కానీ….

Kancha-Ilaiah

తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌ గురించి తెలుగు ప్రజలకు కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. కానీ ఆయన అధికారంలో ఉన్నంత కాలం మాట్లాడలేకపోయిన తెలంగాణ మేధావులు ఇప్పుడిప్పుడే ధైర్యంగా నోరువిప్పి మాట్లాడుతున్నారు. కేసీఆర్‌ గురించి సామాన్య ప్రజలకు తెలియని కొత్త విషయాలు చెపుతున్నారు. వారిలో ప్రొఫెసర్ కంచె ఐలయ్య కూడా ఒకరు.

హైదరాబాద్‌, రవీంద్ర భారతిలో నిన్న ప్రజా గాయకుడు గద్దర్ జయంతి కార్యక్రమం జరిగింది. దానిలో సిఎం రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో సహా మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, పలువురు మేధావులు, కళాకారులు పాల్గొన్నారు.

ADVERTISEMENT

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ కంచె ఐలయ్య, కేసీఆర్‌ తమను ఏవిదంగా అవమానించారో వివరించారు. తెలుగు ప్రజలందరూ ఎంతో గౌరవించే గద్దర్‌ని ‘బూతు పాటలు పాడుకునేవాడని’ కేసీఆర్‌ అవహేళన చేశారని చెప్పారు. ఓ సారి గద్దర్, మరోసారి తాను ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ని కలిసేందుకు వెళితే రెండు మూడు గంటలు ఎదురుచూసేలా చేశారు కానీ లోనికి అనుమతించలేదని ప్రొఫెసర్ కంచె ఐలయ్య చెప్పారు.

‘ప్రగతి భవన్’ పేరుతో కేసీఆర్‌ కట్టుకొన్న విలాసవంతమైన భవనం పేరుని రేవంత్‌ రెడ్డి ‘జ్యోతీరావు ఫూలే’ పేరిట మార్చేయడమే కాకుండా కేసీఆర్‌ నిర్మించుకున్న ఇనుప కంచెలను తొలగించి, దానిలోకి తనవంటి వారితో సహా సామాన్య ప్రజలను కూడా సాధారంగా ఆహ్వానిస్తున్నారని చెప్పారు.

గొప్ప కళాకారుడైన గద్దర్‌ని కేసీఆర్‌ అవమానిస్తే, సిఎం రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే గద్దర్ తొలి జయంతి రోజునే ఈ కార్యక్రమం నిర్వహించడం, గద్దర్ విగ్రహం, మ్యూజియం ఏర్పాటు చేయిస్తుండటం, గద్దర్ పేరిట కళాకారులకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించడంతో తాను, యావత్ దళిత సమాజం చాలా సంతోషిస్తున్నామని ప్రొఫెసర్ కంచె ఐలయ్య చెప్పారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే ప్రగతి భవన్‌కు ‘జ్యోతీరావు ఫూలే’ పేరు పెట్టడంతో కేసీఆర్‌కి కూడా జ్యోతీరావు ఫూలే గుర్తుకు వచ్చారని, అందుకే కూతురు కవితని పంపించి శాసనసభ ఆవరణలో ఆయన విగ్రహం పెట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వినతి పత్రం ఇప్పించారని ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఎద్దేవా చేశారు.

అధికారంలో ఉన్నప్పుడూ ఏనాడూ తనను పలకరించని కేసీఆర్‌, కూతురు కల్వకుంట్ల కవిత చేత మొన్న ఫోన్ చేయించి, ‘జ్యోతీరావు ఫూలే’ విగ్రహం ఏర్పాటు కోసం పోరాటం ప్రారంభిస్తున్నామని, తమతో కలిసిరావాలని కోరుతూ నాకు గాలం వేయాలని ప్రయత్నించారని ప్రొఫెసర్ కంచె ఐలయ్య సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రుల సమక్షంలోనే చెప్పారు.

పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఫూలే విగ్రహం పెట్టాలనే ఆలోచన కూడా చేయని కేసీఆర్‌, ఇప్పుడు ఫూలే విగ్రహం పెట్టాలని కోరుతూ ఉద్యమం చేస్తారట! అంటూ ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఎద్దేవా చేశారు.

సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చాలా జాగ్రత్తగా ఉండాలని లేకుంటే కేసీఆర్‌ మీ ఎమ్మెల్యేలను ఎత్తుకుపోయి మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తారని ప్రొఫెసర్ కంచె ఐలయ్య హెచ్చరించారు.

తెలంగాణ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓటమికి అనేక కారణాలు ఉండవచ్చు. కానీ ప్రొఫెసర్ కంచె ఐలయ్య చెపుతున్నట్లు కేసీఆర్‌లో ఈ అహంభావమే ఆ పార్టీ కొంప ముంచిందని చెప్పవచ్చు.

కానీ నేటికీ బిఆర్ఎస్ పార్టీ తీరు మారలేదని కేటీఆర్‌, హరీష్ రావుల మాటలతో అర్దమవుతోంది. ప్రొఫెసర్ కంచె ఐలయ్య కూడా అదే చెపుతున్నారు. అందుకే కేసీఆర్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారనుకోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories