టిడిపి యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో నిన్న 179వ రోజున పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రవేశించారు. అంతకు ముందు గుంటూరులో పర్యటించినప్పుడు నారా లోకేష్ అమరావతి రాజధాని అంశం ప్రస్తావిస్తూ, ఆనాడు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి, జిల్లాలోని వైసీపీ నేతలు ఏవిదంగా ప్రజలను అమరావతే రాజధానిగా ఉంటుందని మోసగించారని గుర్తుచేసారు.
అమరావతి కోసం భూములిచ్చిన రైతులు అప్పటి నుంచి అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నారని కానీ అమరావతి పేరు చెప్పుకొని గత ఎన్నికలలో గెలిచిన వైసీపీ నేతలు మాత్రం అమరావతి గురించి తమ అధినేతను ప్రశ్నించడానికి భయపడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా వారు జగన్ను నిలదీసి అడగకపోతే రాబోయే ఎన్నికలలో ప్రజలే వారికి తగినవిదంగా బుద్ధి చెపుతారని నారా లోకేష్ హెచ్చరించారు.
నారా లోకేష్ నిన్న సత్తెనపల్లిలో ప్రవేశించినప్పుడు, ఆయన నోటి వెంట రెండు అంశాలు వినాలని ప్రజలు అనుకొన్నారు. 1. కోడెల శివప్రసాదరావు 2. మంత్రి అంబటి రాంబాబు గురించి.
ఈసారి సత్తెనపల్లికి టిడిపి అభ్యర్ధిగా కన్నా లక్ష్మినారాయణ పేరును చంద్రబాబు నాయుడు ఖరారు చేయడంతో కోడెల కుమారుడు శివరాం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అయితే సత్తెనపల్లిలో కోడెల శివప్రసాదరావు ప్రస్తావన లేకుండా మాట్లాడటం కష్టం. కనుక నారా లోకేష్ కూడా ‘సత్తెనపల్లి సింహం కోడెల’ అంటూ మొదలుపెట్టి ఆయన నియోజకవర్గం అభివృద్ధికి ఏమేమి చేశారో వివరించారు.
అవన్నీ వాస్తవం కూడా. కనుక కోడెల శివరాం వాదనలకు బలం చేకూర్చిన్నట్లయ్యింది. నారా లోకేష్ సభలో కోడెల శివప్రసాదరావు ఫోటోలను ఆయన అనుచరులు ప్రదర్శించారు కూడా. వాటిని నారా లోకేష్ కూడా తప్పు పట్టలేరు.
అయితే ఇతర నియోజకవర్గాలలో పర్యటిస్తున్నప్పుడు టిడిపి అభ్యర్ధులని ప్రజలకు పరిచయం చేసి వారిని గెలిపించాలని విజ్ఞప్తి చేసిన నారా లోకేష్, సత్తెనపల్లి సభలో తన పక్కనే కన్నా లక్ష్మినారాయణ ఉన్నప్పటికీ ఆయన గురించి మాట్లాడలేదు. టిడిపి అభ్యర్ధిగా ప్రజలకు పరిచయం చేయలేదు.
ఆయన ఎలాగూ సత్తెనపల్లిలో అంబటి రాంబాబుని ఢీకొని పోరాడక తప్పదు. అందుకు ఆయన సిద్దపడ్డారు కనుక కన్నా లక్ష్మినారాయణ అభ్యర్ధిత్వం గురించి మాట్లాడితే సభలో ఉన్న శివరాం వర్గీయులు అల్లరిచేస్తే పార్టీకి అప్రదిష్ట కలుగుతుందని నారా లోకేష్ ఆ ప్రస్తావన చేయకపోయి ఉండవచ్చు.
చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ల గురించి మంత్రి అంబటి రాంబాబు చాలా చులకనగా, అవహేళన చేస్తూ మాట్లాడుతుంటారు. కనుక నారా లోకేష్ సత్తెనపల్లిలో అడుగుపెట్టినప్పుడు అంబటికి గట్టిగా డోస్ ఇస్తారనుకొంటే ‘పాలిచ్చే ఆవుని కాదని ఆంబోతును తెచ్చిపెట్టుకొన్నారంటూ’ క్లుప్తంగా ముగించేశారు. అయితే చిరంజీవిపై మంత్రులు ఎదురుదాడి చేయదాన్ని నారా లోకేష్ గట్టిగా ప్రశ్నించారు.
2014 నుండి 2019 వరకూ సత్తెనపల్లికి స్వర్ణయుగం.రూ.1400 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది పల్నాటి పులి కోడెల శివప్రసాదరావు గారు. #YuvaGalamPadayatra pic.twitter.com/TpXsY4GbkL
— Lokesh Nara (@naralokesh) August 9, 2023
బ్రో సినిమాలో శ్యాంబాబు పాత్రతో తనను అవమానించారంటూ అంబటి రాంబాబు కుతకుత ఉడికిపోతున్నారు. కడప నడిబొడ్డున నిలబడి “హూ కిల్డ్ బాబాయ్?” అని ధైర్యంగా ప్రశ్నించిన సత్తెనపల్లిలో అంబటి రాంబాబుని ప్రశ్నించలేరనుకోలేము. కానీ ఆయన గురించి ఏమీ మాట్లాడకపోవడం ఆశ్చర్యకరమే. బహుశః జిల్లా దాటేలోపు ఏదైనా మాట్లాడుతారేమో?



