వైసీపీలో జగన్ బాధితులు రెండు రకాలు. 1. తమని పక్కన పెట్టినందుకు కన్నీళ్ళు కారుస్తూ జగన్ వెంటే నడుస్తామని చెప్పుకొనేవాళ్ళు. 2. జగన్ మాకు అన్యాయం చేశారని కన్నీళ్ళు పెట్టుకొంటూ మా దారి మేము చూసుకొంటామని చెప్పేవాళ్ళు. అంటే రెండు రకాల బాధితులలో కన్నీళ్ళు కామన్ అన్నమాట!
అయితే వారిలో మొదటి రకం బాధితులు కాస్త ముందుచూపు ఉన్నవారని చెప్పవచ్చు. జగన్ని తిట్టిపోసి బయటకుపోతే తమ గతి ఏమవుతుందో వారికి బాగా తెలుసు. కనుక సమయం వచ్చేవరకు అంటే వైఎస్ షర్మిల వచ్చి కాంగ్రెస్ తలుపులు తెరిచే వరకు కన్నీళ్ళు కార్చుతూ జగన్ వెంట నడుస్తామని చెప్పుకొంటున్నట్లు భావించవచ్చు.
ఒకవేళ తమ కన్నీళ్ళని చూసి జగన్ కరిగి మళ్ళీ తమ సీటు తమకే ఇచ్చినా ఇచ్చేయవచ్చనే చిన్న దురాశ కూడా వారిలో ఉండి ఉండవచ్చు. కానీ అది జరిగే పని కాదు. కనుక కన్నీళ్ళు కార్చేస్తూ సినీ నటుల కంటే గొప్పగా నటించేస్తున్నారు.
ఇక రెండో రకం బాధితుల జాబితాలో తాజాగా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి బయటపడ్డారు. జగన్ తనను పక్కన పెట్టి తన సొంత వర్గానికి చెందినవారికి టికెట్ ఇవ్వబోతున్నారని తెలుసుకొని ఆయన కన్నీళ్ళు పెట్టుకొన్నారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ, “నేను జగన్ని నమ్మి వైసీపిలో చేరాను. పార్టీలో చేరినప్పటి నుంచి ఆయనకు విధేయుడిగానే ఉన్నాను. ఎన్నడూ ఆయన మాట జవ దాటలేదు. కానీ ఆయన నాకు టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టి నాగొంతు కోసేందుకు సిద్దమవుతున్నారు.
వైసీపిలో చేరినప్పుడే నాకు మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. కానీ ఇవ్వకుండా నన్ను మోసం చేశారు. అయినప్పటికీ ఏదో రోజున నాకు న్యాయం చేస్తారనే ఆశతోనే ఆయన చెప్పిన్నట్లు నడుచుకున్నాను. జగన్ని నమ్ముకొని వచ్చిన మాకు ఇంత అన్యాయం చేస్తారనుకోలేదు. ఆయనతో మాట్లాడేందుకు నాకు కనీసం జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. నా జీవితంలో నాకు ఇంత అవమానం ఎప్పుడూ జరుగలేదు.
అనంతపురం జిల్లాని, ముఖ్యంగా రాయదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధిచేస్తామంటూ జగన్ ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ వాటిలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. ఓబుళాపురం గనుల తవ్వకాలలో అక్రమాలు కూడా పార్టీ ప్రతిష్టని దెబ్బ తీసాయి. ఈ కారణంగానే నియోజకవర్గంలో వైసీపి పట్ల వ్యతిరేకత పెరిగింది. దీనికి జగనే బాధ్యత వహించాలి కానీ నన్ను బలిచేస్తానంటే ఎలా? చేయని నేరానికి నేను ఎందుకు బలి కావాలి?
ఇక్కడ వైసీపి జెండాతో, జగన్ ఫోటోతో ఎవరూ గెలిచే పరిస్థితి లేదు. అభ్యర్ధులు ఎవరైనా వారి సొంత బలంతోనే నెగ్గాల్సి ఉంటుంది. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. అయినా బీసీ వర్గానికి చెందిన నన్ను కాదని ఆయన సొంత వర్గానికి చెందినవారికి టికెట్ ఇచ్చుకొంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి మాకు టికెట్ ఇవ్వకపోతే మేము పార్టీకి రాజినామా చేసి స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేస్తాము. నేను కళ్యాణదుర్గం నుంచి, నా భార్య రాయదుర్గం నుంచి పోటీ చేయడం ఖాయం. జగన్ ఎవరిని వైసీపి అభ్యర్ధులుగా నిలబెట్టినా వారు మా చేతుల్లోనే ఓడిపోవడం ఖాయం. జగన్ నిర్ణయాలు, ఆలోచనలు అన్నీ వైసీపికి శాపంగా మారాయి,” అని కాపు రామచంద్రా రెడ్డి అన్నారు.




