సరిగ్గా 26 ఏళ్ళ క్రితం ఇదే రోజున అంటే 1999, జూలై 26న భారత్ దళాలు కార్గిల్ యుద్ధంలో విజయం సాధించాయి. అందుకే ఏటా జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ పేరిట నాడు ఆ యుద్ధంలో అమరులైన వీర జవాన్లకు నివాళులు అర్పిస్తున్నాము. ప్రాణాలు పణంగా పెట్టి దేశాన్ని కాపాడిన వీర జవాన్లకు సెల్యూట్ చేస్తుంటాము.
1999లో నవాజ్ షరీఫ్ పాక్ ప్రధానిగా, పర్వేజ్ ముషారఫ్ పాక్ సైన్యాధ్యక్షుడుగా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు భారత్ని దొంగ దెబ్బ తీసి జమ్ము కశ్మీర్ని ఆక్రమించుకోవాలనుకున్నారు. ఇందుకోసం జమ్ము కశ్మీర్లోని లద్దాక్లోని కార్గిల్ పట్టణం వైపున్న పర్వత శ్రేణులను ఎంచుకున్నారు.
మంచు విపరీతంగా కురుస్తున్న సమయంలో కార్గిల్ పర్వతాలపై భారత్ సైనికులు లేని సమయంలో అక్కడకు ఉగ్రవాదులు, పాక్ సైనికులను భారీగా ఆయుధాలతో రహస్యంగా పంపించారు. వారు కార్గిల్ పర్వతాలలో కీలక ప్రాంతాలలో శిబిరాలు నిర్మించుకకుంటే పాక్ సైన్యం వారికి అవసరమైన ఆహారం, ఆయుధాలు సరఫరా చేస్తుండేది.
ఈ విషయం తెలిసి నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మొదట షాక్ అయ్యారు. తర్వాత తీవ్ర ఆగ్రహం చెందారు. ఎందువల్లనంటే, అయన భారత్-పాక్ స్నేహ సంబంధాలు బలోపేతం చేసుకోవాలనే ఆలోచనతో ఆయన 1999 ఫిబ్రవరిలో ధిల్లీ నుంచి లాహోర్కి బస్సు యాత్ర చేశారు. లాహోర్లో ఆయన, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ‘లాహోర్ డిక్లరేషన్’పై సంతకాలు చేశారు. ఆ స్నేహ, శాంతి ఒప్పందం జరిగిన మూడు నెలలకే పాక్ పాలకులు ఈవిదంగా దుర్బుద్ధి ప్రదర్శించడంతో అటల్ బిహారీ వాజ్పేయి కార్గిల్ యుద్ధానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అప్పుడు భారత్ దళాలు ‘ఆపరేషన్ విజయ్’ పేరుతో వారితో యుద్ధం ప్రారంభించాయి.
ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్’ మే 7న మొదలుపెట్టి 10న అంటే మూడు రోజులలోనే ముగిసింది. కానీ 1999 మే నెలలో మొదలైన కార్గిల్ యుద్ధం సుమారు రెండు నెలల పాటు సాగి జూలై 26న భారత్ సేనలు కార్గిల్ పర్వత శిఖరాలలో శత్రువులను అంతమోదించి మళ్ళీ ఆ ప్రాంతాలన్నిటినీ తమ అధీనంలో తీసుకోవడంతో ముగిసింది.
‘ఆపరేషన్ సిందూర్’లో కేవలం 5 మంది సైనికులు మాత్రమే చనిపోగా, నాడు జరిగిన కార్గిల్ యుద్ధంలో 527 మంది సైనికులు, సైనికాధికారులు చనిపోగా, మరో 1,363 మంది గాయ్యపడ్డారు. కనుక ఆనాడు కార్గిల్ యుద్ధం ఎంత భీకరంగా సాగిందో అర్ధం చేసుకోవచ్చు.
అనేకమంది సైనికాధికారులు, సైనికులు తమ ప్రాణాలు పణంగా పెట్టి దేశ సరిహద్దులను కాపాడారు. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ఆ వీర సైనికులకు, ఆ యుద్ధంలో అమరులైన సైనికుల పోరాట స్పూర్తి, త్యాగాలను స్మరించుకుంటూ నేడు ‘కార్గిల్ విజయ్ దివస్’ దేశ ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. వీర సైనికులకు సెల్యూట్ చేస్తున్నారు.




