తెలంగాణలో కల్వకుంట్ల కవిత నేతృత్వంలో ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పార్టీ ఏప్రిల్ 25న ఏర్పాటు కాబోతోంది. మొదట్లో ఆమె పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించినప్పుడు కాంగ్రెస్, బిజేపిలు ‘ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ ఏర్పాటు చేసుకోవచ్చునంటూ’ రొటీన్ ప్రకటనతో సరిపెట్టాయి. బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా స్పందించ లేదు.
కానీ కోలీవుడ్ హీరో విజయ్ దళపతి టివికే పార్టీతో తమిళనాడు రాజకీయాలలో ప్రవేశిస్తున్నప్పుడు మాత్రం బిజేపి (కేంద్ర ప్రభుత్వం) ఆ పార్టీతో పొత్తు కోసం చాలా ఆరాటపడింది. నయాన్న లేదా భయాన్న పొత్తుకి ఒప్పించేందుకు ప్రయత్నించింది. కానీ ఆయన ఒత్తిళ్ళకు లొంగలేదు. బిజేపితో పొత్తుకి అంగీకరించలేదు.
ఏప్రిల్ 6 వరకు నామినేషన్లకు గడువు. కనుక నేడో రేపో టి వి కే పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించనున్నారు. అంటే విజయ్ ఒంటరి పోరాటానికే సిద్ధపడుతున్నారన్న మాట.
పొత్తు వద్దని ఖరాఖండీగా చెప్తున్న విజయ్ని ఒప్పించేందుకు బిజేపి ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది. కానీ తెలంగాణలో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెడుతుంటే బిజేపి (కేంద్రం) ఎటువంటి అవరోధాలు సృష్టించలేదు. కనీసం ఆమె పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినా స్పందించలేదు.
నేడు శ్రీరామ నవమి హడావుడిలో ఉన్నాయి కనుక రేపు స్పందిస్తాయేమో? లేదా ఏప్రిల్ 25న ఆమె పార్టీ జెండా, ఎజెండా ప్రకటించిన తర్వాత స్పందిస్తాయేమో? ఒకవేళ అప్పుడూ స్పందించకపోతే మూడు పార్టీలు ఆమెను లైట్ తీసుకుంటున్నాయని అనుకోవాల్సి ఉంటుంది.
ఒక విధంగా ఆమెకూ ఇది మంచిదే. ఎటువంటి ఒత్తిళ్ళు లేకుండా పార్టీ ఏర్పాటు చేసుకొని చాప కింద నీరులా తెలంగాణలో పార్టీని విస్తరించి బలోపేతం చేసుకోవచ్చు.






