కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పుకోలేక తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కండువా వేసుకొని తిరుగుతున్నారు. ఆమె తన ఉనికిని చాటుకునేందుకు, రాజకీయ మనుగడ కోసం చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఆమెకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.
ఇటీవల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ బాధ కంటే బీఆర్ఎస్ మౌనమే తనను ఎక్కువగా బాధించిందన్నారు కల్వకుంట్ల కవిత.
తన కోసం పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు సిద్దపడిన తండ్రి, అన్న తన పట్ల ఇంత కర్కశంగా వ్యవహరిస్తారని ఆమె ఊహించలేకపోయారు. అందుకే ఈ బాధ.
కానీ ఇది ఆమె స్వయంకృతమే. తండ్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ విశ్వసనీయతని ఆమె దెబ్బ తీసేవిదంగా మాట్లాడారు. పార్టీలో, ప్రజలలో అన్న కేటీఆర్, బావ హరీష్ రావుల గౌరవాన్ని దెబ్బ తీసే విదంగా మాట్లాడారు. కనుక వారి ఆగ్రహం సహేతుకమే అని భావించవచ్చు. కనుక వారు ఆమెని రాజకీయంగా ఏకాకిని చేసి వదిలేశారనుకోవచ్చు.
కానీ కల్వకుంట్ల ఇంటి ఆడబిడ్డ పట్ల ఓ పరాయి వ్యక్తి అంత అనుచితంగా మాట్లాడినా కేసీఆర్, కేటీఆర్ మౌనంగా ఉండిపోవడంతో వారికీ జగన్మోహన్ రెడ్డికి తేడా ఏముంది? అనిపించక మానదు.
జగన్ 16 నెలలు చంచల్ గూడా జైల్లో ఉన్నప్పుడు తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల వైసీపీని కాపాడి జగన్ బయటకు వచ్చాక భద్రంగా చేతిలో పెట్టారు. వారిని జగన్ దారుణంగా అవమానించడమే కాకుండా వైసీపీ నేతల చేత, సొంత మీడియా చేత వారిపై ఆరోపణలు చేయిస్తూ చాలా అనుచితంగా వ్యవహరించారు.
కల్వకుంట్ల కవితపై కూడా బీఆర్ఎస్ పార్టీలో దెయ్యాలే తీన్మార్ మల్లన్నతో అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయించాయని గుసగుసలు కూడా వినిపించాయి.
జగన్, విజయమ్మ, షర్మిల ఆస్తుల కోసం కొట్లాడుకొని రోడ్డున పడితే, కల్వకుంట్ల కవిత రాజకీయ పదవులు, గుర్తింపు కోసం కోట్లాడి రోడ్డున పడ్డారు. షర్మిల, కవితల పట్ల వారి అన్నలు జగన్, కేటీఆర్ ఇద్దరూ ఒకేలా ప్రవర్తించారని స్పష్టమవుతోంది.
అత్యంత శక్తివంతులైన మహిళలుగా గుర్తింపు పొందిన కల్వకుంట్ల కవిత, వైఎస్ షర్మిల, విజయమ్మ, విజయశాంతి వంటివారు రాజకీయాలలో ఎదుగుబొదుగూ లేకపోగా ఎదురుదెబ్బలు తినాల్సివస్తోంది. ఈ పరిస్థితి చూస్తునప్పుడు రాజకీయాలలో మహిళలు రాణించడం మాట దేవుడెరుగు సముచిత గౌరవం, స్థానం కోసం వారు పోరాడాల్సిందేనా? అని సందేహం కలుగుతుంది.




