తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ నేతలు టీడీపీని, చంద్రబాబు నాయుడుని ఎంతగా ద్వేషిస్తున్నప్పటికీ ఆ పార్టీ విదానాలు, ఆయన వైఖరిని ఆరాధిస్తూనే ఉంటారనే విషయం ఏదో సందర్భంలో వారే బయటపెట్టుకుంటారు.
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం టీవీ 5 తెలుగు ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ప్రశ్నకు సమాధానంగా “ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నన్ను అరెస్ట్ చేసి తిహార్ జైలుకి తీసుకుపోతునప్పుడు నాకు ఎంతో బాధ కలిగింది.
ఆ బాధ కంటే నాకు మా పార్టీ అండగా నిలబడలేదని ఎక్కువ బాధ పడ్డాను. నా అరెస్టుని ఖండిస్తూ ప్రెస్మీట్ పెట్టి మాట్లాడమని నా తండ్రి కేసీఆర్ని కోరాను. కానీ మాట్లాడలేదు.
నన్ను అరెస్ట్ చేసినందుకు నిరసనగా మా పార్టీ ఉద్యమిస్తుందని అనుకున్నాను. కానీ ఏమీ జరగనట్లు ఎవరి పనులు వారు చేసుకున్నారు. కనీసం ఎవరూ నాకు సంఘీభావం తెలుపలేదు. పార్టీలో నాకు ఎంతో ప్రాధాన్యత ఉందనుకున్నాను కానీ లేదని అర్ధమైంది.
ఇదివరకు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు, చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు వారి కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు అందరూ తరలివచ్చి వారి కోసం ఎంతగానో పోరాడారు. వారికి అండగా నిలబడ్డారు. కుటుంబంలో, పార్టీలో ఒకరికి కష్టం వచ్చినప్పుడు ఏవిదంగా అందరూ కలిసికట్టుగా ఉండాలో వారు నిరూపించి చూపారు.
కానీ నేను జైల్లో ఉంటే ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. నన్ను విడిపించేందుకు కేసీఆర్ న్యాయపోరాటానికి అవసరమైన అన్ని ఖర్చులు భరించారు. కానీ పార్టీ పరంగా నాకు మద్దతు లభించేలా చేయలేకపోయారు.
కానీ తన రాజకీయాల వల్లనే నేను జైలుకి వెళ్ళాల్సి వచ్చిందనే బాధతో పార్టీని బీజేపిలో విలీనం చేసేందుకు సిద్దపడ్డారు. కానీ అప్పుడు నేనే వారించాను.
నా కోసం పార్టీని బలి చేస్తే దానినే నమ్ముకున్న లక్షల మంది కార్యకర్తల జీవితాలు నాశనం అవుతాయని, కనుక నేను ఎంతకాలం అయినా జైల్లో ఉంటాను. పార్టీని మాత్రం కాపాడుకోమని చెప్పాను.
నేటికీ పార్టీలో కొందరు భ్రష్టు పట్టించేస్తున్నారనే ఆవేదన తప్ప నేను పార్టీని వ్యతిరేకించడం లేదు,” అని కల్వకుంట్ల కవిత అన్నారు.
రాజకీయ పార్టీలకు కార్యకర్తలే బలమని బాగా తెలిసినవారు సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్. అందుకే వారి కోసం ఇద్దరూ ఎంత దూరమైన వెళుతుంటారు. అలాగే చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ కుటుంబ బంధాలకు చాలా ప్రాధాన్యం ఇస్తారు. కనుకనే చంద్రబాబు నాయుడుకి కష్టం వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు తరలివచ్చి పోరాటాలు చేశాయి.
జగన్ కోసం తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల ఇద్దరూ కొండంత అండగా నిలబడ్డారు. జగన్ 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు వారిరువురూ గట్టిగా నిలబడకపోయి ఉండి ఉంటే, అప్పుడే వైసీపీ తుడిచిపెట్టుకుపోయేది.
వారిద్దరూ పార్టీని కాపాడి మళ్ళీ భద్రంగా జగన్కి అప్పగిస్తే, ఆయన వారిద్దరినీ పార్టీలో నుంచి రాష్ట్రంలో నుంచి బయటకు గెంటేశారు!
అక్కడితో ఆగలేదు. ఆస్తుల కోసం తల్లిని, చెల్లిని కోర్టుకీడ్చారు. వారిపై తన పార్టీ నేతల చేత సొంత మీడియా చేత బురద జల్లించారు కూడా!
తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలని, ముఖ్యంగా కార్యకర్తలని పట్టించుకోలేదు. జగన్ అయితే కార్యకర్తల స్థానంలో వాలంటీర్లని కూడా ఏర్పాటు చేసుకున్నారు.
అయినవాళ్ళని, పార్టీ శ్రేణులను దూరం చేసుకున్నందుకే కేసీఆర్, జగన్ నష్టపోయారు. పరువు పోగొట్టుకుంటున్నారు. ఇంకా పోగొట్టుకుంటూనే ఉన్నారు.
కానీ అందరినీ కలుపుకుపోతున్న సిఎం చంద్రబాబు నాయుడు విజయాలు సాధిస్తూ మంచి పేరు సంపాదించుకుంటున్నారు.
తన తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్, బిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఆవిదంగా ఉండాలని కల్వకుంట్ల కవిత చెప్పకనే చెప్పారనుకోవచ్చు.




