తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, “టిఆర్ఎస్ పార్టీ పేరుని బీఆర్ఎస్ పార్టీ వదులుకుంది కనుక ఇప్పుడా పేరు ఫ్రీ అయిపోయింది. కనుక ఎవరైనా ఆ పేరు వాడుకోవచ్చు. పాత పేరు, కొత్త జెండా, అజెండాతో త్వరలో మా పార్టీని ప్రకటిస్తా. మా పార్టీ ఆచార్య జయశంకర్ సిద్ధాంతాల ప్రకారమే పని చేస్తుంది తప్ప బీహార్ నుంచి వచ్చిన సిద్ధాంతకర్తలు ఉండరు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నిద్రావస్థలో ఉంది. ఎప్పటికైనా మేల్కొంటుందో లేదో తెలీదు,” అని అన్నారు.
టిఆర్ఎస్ పార్టీ పేరును ఎవరైనా వాడుకోవచ్చు.. పాత పేరు కొత్త జెండా అని కల్వకుంట్ల కవిత చెప్పడంతో ఆమె ‘టిఆర్ఎస్ పార్టీ’ పేరుతో తన కొత్త పార్టీని రిజిస్టర్ చేయిన్చుకున్నారా?అనే సందేహం కలుగుతుంది. ఇటీవల ఆమె పార్టీ పేరు ‘తెలంగాణ ప్రజా జాగృతి’ అని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడామె టిఆర్ఎస్ పార్టీ అన్నట్లు మాట్లాడారు. ఒకవేళ ఆమెకు టిఆర్ఎస్ పార్టీ రిజిస్టర్ చేసి ఉండి ఉంటే, ఈ పేరుతోనే బీఆర్ఎస్ పార్టీ ఓట్లు సగం చీలిపోయే అవకాశం ఉంటుంది. కనుక దీనిపై అభ్యంతరం చెపుతూ బీఆర్ఎస్ పార్టీ న్యాయపోరాటానికి సిద్దపడవచ్చు.
ఒకవేళ ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో రిజిస్టర్ చేసుకున్నా పార్టీ ప్రకటన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎన్నికలలోగా ఆమె బీఆర్ఎస్ పార్టీ నేతలను ఆకర్షించలేకపోతే ఆ ఎన్నికలలో నిలబడటం, పోరాడటం చాలా కష్టమే అవుతుంది. కనుక కవిత టార్గెట్ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీయే.




