సిఎం చంద్రబాబు నాయుడుతో సహా ఏపీకి చెందిన అనేక మంది రాజకీయ నాయకులు హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. కనుక తరచూ వారు హైదరాబాద్కి రాకపోకలు సాగిస్తుంటారు. వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అదే అందరికీ మంచిది కూడా!
కానీ ఏపీని వ్యతిరేకించే, చీదరించుకునే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏపీకి వస్తే వారికి ఆహ్వానం పలికేందుకు కొందరు క్యూ కడుతుంటారు. కల్వకుంట్ల కవిత శనివారం తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. ఆమె హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నప్పుడు పలువురు ఆమెకు శాలువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికేందుకు క్యూకట్టారు.
ఏపీతో కృష్ణాగోదావరి నీళ్ళు పంచుకునే విషయంలో మొట్టమొదట అభ్యంతరం చెప్పేది బీఆర్ఎస్ పార్టీయే. బనకచర్ల ప్రాజెక్టుని ఏవిదంగా అడ్డుకున్నారో అందరూ చూశారు.
కవిత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో లేకపోవచ్చు. కానీ నీళ్ళు లేదా మరే విషయంలోనైనా ఏపీ పట్ల ఆమె వైఖరి అలాగే ఉంది. ఉంటుంది కూడా.
బీఆర్ఎస్ పార్టీ నేతలకు లేదా ఆమెకు స్వాగతం పలికేందుకు పోటీ పడిన వారందరినీ వారు గుర్తుపెట్టుకొని అవసరమైనప్పుడు సాయపడతారా?అంటే కాదని అందరికీ తెలుసు. మరి అటువంటప్పుడు వారి వెనక పరుగులు తీయడం దేనికి?
కనీసం మీడియాలో ఏపీ నాయకుల ఫోటోలు, ఏపీ వార్తలు చూసేందుకు కూడా ఇష్టపడని వారిని ఆహ్వానించడం కోసం పరుగులు తీయడం సిగ్గు చేటు కాదా?
ఆమెకు స్వాగతం పలికినవారిలో కొందరు ‘కవితమ్మ నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ నినాదాలు కూడా చేశారు. అంటే వారు ఆమె మనుషులేనా?అని సందేహం కలుగుతుంది. ఆమె మనుషులే అయితే స్వాగతం చెప్పేందుకు ఇలా ముందస్తు ఏర్పాటు చేసుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది.






