నేడు తెలంగాణ శాసనసభ సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి మాజీ సిఎం కేసీఆర్ని ఉద్దేశ్యించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్కి మొదటి నుంచి దళితులంటే చాలా చులకనభావం ఉంది. తెలంగాణ ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టి, దళితుడైన రాజయ్యకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి తర్వాత అదీ పీకేశారు.
మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా పార్టీ ఫ్లోర్ లీడర్గా దళితుడైన భట్టి విక్రమార్కని నియమించుకుంటే, దానికీ దళితులు అనర్హులనుకున్నారు. మా పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయింపజేసుకొని ఆయనకా పదవి లేకుండా చేశారు.
మేము అధికారంలోకి వచ్చాక దళితుడైన గడ్డం ప్రసాద్ కుమార్కి స్పీకర్ పదవి ఇచ్చాము. కనీసం అప్పుడైనా కేసీఆర్ అయన ముందు చేతులు కట్టుకొని నిలబడుతారని ఆశిస్తే, అది అవమానంగా భావించి శాసనసభ రావడం మానుకున్నారు.
హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరూ దళితులైన స్పీకర్, డెప్యూటీ సిఎంలను టార్గెట్ చేసుకొని అవమానిస్తున్నారు. మా ప్రభుత్వంలో దళిత మంత్రుల పట్ల బీఆర్ఎస్ పార్టీ నేతలు చాలా అవమానకరంగా వ్యవహరిస్తున్నారు.
మీ మంత్రాలకు చింతకాయలు రాలవని గుర్తుంచుకొండి. ముందు మీ పార్టీలో కీచులాటలని పరిష్కరించుకుంటే మంచిది,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
సిఎం రేవంత్ రెడ్డి వాదన వింటే దళితుల పట్ల కేసీఆర్కి నిజంగానే ఇంత చులకనభావం ఉందా? అని ఎవరికైనా అనుమానంకలుగుతుంది. అయన చెప్పిన ఈ ఉదాహరణలన్నీ చూస్తే నిజమే అనిపిస్తుంది.
కానీ రాజకీయ నాయకులు ఏదైనా వివాదాలలో చిక్కుకున్నప్పుడు లేదా తమ ప్రత్యర్ధులను రాజకీయంగా దెబ్బ తీసేందుకు ఇలా కులం కార్డుని వాడుకుంటూనే ఉంటారు. కానీ వారు ఈ కులం కార్డుని ఎంత బాగా వాడగలిగారనే దానిని బట్టి ఫలితాలు వస్తాయి.
సిఎం రేవంత్ రెడ్డి కూడా ప్రస్తుతం అదే చేస్తున్నారనుకోవచ్చు. శాసనసభలో కేసీఆర్ కంటే దళితులు ఉన్నత స్థానాలలో ఉన్నందునే సభకు రావడం లేదనే సిఎం రేవంత్ రెడ్డి వాదన తప్పకుండా ప్రజలకు, ముఖ్యంగా దళిత సామాజిక వర్గానికి బాగా చేరుతుంది.
కనుక సిఎం రేవంత్ రెడ్డి ప్రయోగిస్తున్న ఈ కులం కార్డుతో కేసీఆర్ ప్రతిష్ట మరింత మసకబారుతుంది. అది బీఆర్ఎస్ పార్టీకి మరింత నష్టం కలిగిస్తుంది కూడా.
దీనినే మరోకోణంలో నుంచి చూసినట్లయితే, సిఎం రేవంత్ రెడ్డి దళితులకు కీలకపదవులు ఇచ్చి కేసీఆర్ని శాసనసభకు రాకుండా కట్టడి చేస్తున్నారా? అని కూడా అనుకోవచ్చు.






