ఏపీని రెండు ముక్కలుగా విడగొట్టి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసుకొన్న వ్యక్తి కేసీఆర్. ఆనాడు వేర్పాటువాదిగా పదేళ్ళపాటు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలతో అలుపెరుగని పోరాటాలు చేశారు. అదే కేసీఆర్ నేడు హైదరాబాద్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ సమైక్య దినోత్సవ వేడుకలు జరుపుతుండటం విశేషం.
ఆనాడు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా నిజాం నవాబు తమ తెలంగాణ సంస్థానాన్ని భారత్లో కలపడానికి నిరాకరించారు. భారత్తో యుద్ధానికి సిద్దమయ్యారు కూడా. దాంతో అప్పటి ప్రధాని సర్దార్ వల్లభ్ బాయ్ పటేల్ ఆదేశం మేరకు భారత్ సేనలు హైదరాబాద్ను చుట్టుముట్టడంతో నిజాం నవాబు ఓటమి అంగీకరించి 1947, సెప్టెంబర్ 17న తెలంగాణ సంస్థానాన్ని భారత్లో విలీనం చేశారు.
ఆ విధంగా నిజాంపాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించినందున నాటి నుంచి సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకొంటున్నారు.
కానీ అలాచేస్తే నిజాం నిరంకుశ పాలనలో తెలంగాణ ప్రజల ధనమానప్రాణాలు దోచుకోబడ్డాయనే వాస్తవాన్ని ప్రభుత్వమే అధికారికంగా ధృవీకరించిన్నట్లవుతుంది. అది మజ్లీస్ పార్టీకి ఆగ్రహం కలిగిస్తుంది.మజ్లీస్ ఆగ్రహిస్తే తెలంగాణలో ముస్లిం ఓట్లు బిఆర్ఎస్కి పడకపోవచ్చు. కనుక తెలంగాణ విమోచన అని పలికేందుకు కూడా కేసీఆర్ ఇష్టాపడలేదు.
ఈ బలహీనతను బీజేపీ ఉపయోగించుకొంటూ ఏటా తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతూ కేసీఆర్ని విమర్శిస్తోంది. కానీ కేసీఆర్ ఏనాడూ ఖాతరు చేయలేదు. అయితే బీజేపీ చేస్తున్న హడావుడితో రాజకీయంగా నష్టపోతామని గ్రహించి సెప్టెంబర్ 17న ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’గా జరపడం ప్రారంభించారు. ఏమంటే తెలంగాణ విమోచన కాదు భారత్లో విలీనం అయ్యింది కనుక సమైక్యతా దినోత్సవం అని సమర్ధించుకొంటున్నారు.
నాడు ఆంద్రా పాలకుల నుంచి తెలంగాణకు విముక్తి లభించిందని కేసీఆర్ నేటికీ వాదిస్తుంటారు. కానీ నిజాం నిరంకుశపాలన నుంచి విముక్తి లభించిందని మాత్రం ఒప్పుకోరు. అది సమైక్యమట! ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నేడు హైదరాబాద్లో బీజేపీ, బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా విమోచన, సమైఖ్య దినోత్సవాలు జరిపాయి. ఇంతకీ తెలంగాణది విమోచనా సమైక్యమా?
నాడు తెలంగాణ కోసం వేర్పాటువాదిగా మారి పోరాటాలు చేసిన కేసీఆర్ నేటికీ ఆంధ్రాతో నీళ్ళ కోసం, ఆస్తుల కోసం కీచులాడుతూనే ఉన్నారు. ఏపీ రాజకీయాలలో తెరవెనుక నుంచి చక్రం తిప్పుతూ తాను కోరుకొన్నవారిని ముఖ్యమంత్రి కుర్చీలో పెట్టగలుగుతున్నారు.
కానీ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పి ప్రధాన మంత్రి అవ్వాలనే కోరికతో తన తెరాస పార్టీని బిఆర్ఎస్ పార్టీగా మార్చుకొన్నప్పటి నుంచి జాతీయస్పూర్తి, జాతీయ సమైక్యత, సమగ్రత అంటూ మాట్లాడుతుండటమే విడ్డూరం.