కుడి ఎడమైతే ఇంతేగా…? ఇప్పుడు తెలిసొస్తుందా సారూ..?

KCR

అధికారంలో ఉన్నంతకాలం నాఅంతటోడు లేదు అంటూ అన్ని పార్టీల నేతల మీద విరుచుకుపడిపోయి వారిని నయానో భయానో తమ పార్టీలోకి రప్పించుకుని అసలు రాష్ట్రంలో ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలనీ ఆలోచించిన కేసీఆర్ కు ఇప్పుడు చేసిన తప్పు తెలిస్తోందా..?

ఈ తరం రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అధికారం ఉన్నన్నాళ్ళు పదవిని , అధికారాన్ని, పార్టీని అడ్డుపెట్టుకుని దండుకోవడం….అదే పార్టీ అధికారం కోల్పోగానే నియోజకవర్గ అభివృద్ధి పేరుతో కొందరు.., అధినేత మీద కోపంతో మరికొందరు ఇలా ఒక్కొక్కొరు ఒక్కో కారణం చూపిస్తూ ఓడిపోయిన పార్టీకి ఆ పార్టీ అధినేతకు హ్యాండ్ ఇచ్చి అధికార పార్టీ కండువా కప్పుకోవడం సర్వ సాధారణమైపోయింది.

ADVERTISEMENT

ఒకరకంగా చెప్పాలంటే రాజకీయాలలోకి ఇటువంటి కుళ్ళు సంస్కృతిని తీసుకువచ్చింది కేసీఆర్ అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. గతంలో కూడా పార్టీల మార్పు ప్రక్రియ జరిగేది కానీ ఇటువంటి తరహా ఆలోచనతో అసలు పార్టీనే భూస్తాపితం చేసే ఆలోచనతో నాయకుల మార్పిడి కొనసాగేది కాదు.

తెలంగాణలో టీడీపీ పూర్తిగా కనుమరుగయిపోవడానికి, కాంగ్రెస్ పార్టీ దశాబ్ద కాలం పాటు ప్రతిపక్షంలో ఎటువంటి రాజకీయ బలం లేకుండా పోరాడడానికి కానీ కేసీఆర్ మిషన్ ఆకర్ష పథకాలే కారణం. ఇప్పుడు అదే ఫార్ములాను బిఆర్ఎస్ పై అప్లై చేస్తున్నారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ.

త్వరలో తెలంగాణలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు గాను బిఆర్ఎస్ పార్టీ నుండి ఉలుకు పలుకు లేకుండా పోయింది. ఆ పార్టీ నుండి నేతలు ఒక్కొక్కరుగా కారు దిగి హస్తం గూటికి, కమలం చేతికి వెళ్లిపోతున్నారు. వారిని కట్టడి చేసే ప్రయత్నాలు చేయడంలో కూడా కేసీఆర్ విఫలమవుతున్నారు.

మాజీ బిఆర్ఎస్ ఎంపీలు సీతారాం నాయక్, నగేష్, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి నిన్న బిఆర్ఎస్ కారు దిగి కాషాయం కండువా కప్పుకున్నారు. అలాగే మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, కోనేరు కోనప్ప, పైళ్ల శేఖర్ రెడ్డి త్వరలోనే గులాబీ బాస్ కు హ్యాండ్ ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో ఊహాగానాలు ఊపందుకున్నాయి.

‘నిప్పు లేనిదే పొగ రాదు’ అనే సామెత మాదిరే ‘మార్పు లేనిదే ప్రచారాలు జరగవు’ అన్నట్టుగా ఈ బిఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడడం కాంగ్రెస్ లో చేరడం ఖాయం అంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. వెళ్లేవారిని అడ్డుకోలేక ఉన్నవారిని కట్టడి చేయలేక పార్టీని కాపాడుకోవడం ఎంత కష్టమో కేసీఆర్ కి ఇప్పుడు తెలిసి వస్తుంది అంటున్నారు తెలంగాణ టీడీపీ మద్దతుదారులు.

‘బండ్లు ఓడలవుతాయి…ఓడలు బండ్లవుతాయి’ అనే సామెత మాదిరే ‘రాజకీయాలలో అధికార పక్షం ప్రతిపక్షం అవుతుంది….ప్రతిపక్షం అధికార పక్షం అవుతుంది’ అనేది రాజకీయ పార్టీల అధినేతలు గ్రహించాలి. అధికారం ఉన్నన్నాళ్ళు అంతా నాదే అందరు నావాల్లే అంటూ లాగేసుకుని దొరల తరహా విధానాలు అనుసరిస్తే, విపక్షంగా మారిన రోజు సొంతవారు కూడా పరాయి వారు కాకతప్పదు అనేది కేసీఆర్ కు ఇప్పుడు బాగా అర్ధమవుతుంది అంటున్నారు టి. టీడీపీ శ్రేణులు.

ADVERTISEMENT
Latest Stories