పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను ఉహించక, మంత్రుల మీద, పార్టీ నాయకుల మీద ప్రజలలో పెరిగిన అసంతృప్తిని పసిగట్టలేక, ప్రతిపక్షాలను తక్కువగా అంచనా వేయడం వలన అసెంబ్లీ ఎన్నికలలో సిట్టింగులకే అవకాశం కల్పించి తన కారు బ్యాటరీని తానే డిశ్చార్జ్ చేసుకున్నారు కేసీఆర్.
ఎన్నికల ఫలితాల తరువాత బిఆర్ఎస్ పార్టీ ఓటమికి కేసీఆర్ మోనార్కి విధానాలే కారణమంటూ పలు టీవీ ఛానెల్స్ లో చర్చలు, డిబేట్ లు, విశ్లేషణలు పెద్దఎత్తున జరిగాయి. వాటి ఫలితమే ఏపీలో నేటి జగన్ ఇంచార్జ్ ల మార్పు ప్రక్రియ. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో తత్వం భోదపడిన బిఆర్ఎస్ పెద్దలకు రానున్న పార్లమెంట్ ఎన్నికలు అత్యంత కీలకం కానున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలలో సిటింగ్ ఎమ్మెల్యే లకే తొలి ప్రాధాన్యత ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఎంపీ స్థానాలలో మార్పులు చేస్తారా? లేక సిట్టింగ్ లనే నమ్ముకుంటారా..?అని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. అసెంబ్లీ ఫలితాలతో తమ స్థానాలకు అధిష్టానం ఎక్కడ ఎసరు పెడుతుందో అని సిట్టింగ్ ఎంపీ లు బయపడుతుంటే, కొత్త వారికీ ఛాన్స్ ఇచ్చే అవకాశం లేకపోలేదనే ఊహాగానాలతో ఎంపీ స్థానానికి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న నేతలలో కొత్త ఆశలు చిగురించాయి.
చూడాలి మరి కేసీఆర్ నిర్ణయం ఎవరిని మెప్పిస్తుందో.? ఎవరిని నొప్పిస్తుందో.? మార్చక ఒకసారి ఎన్నికలలో బంగపడితే ఇప్పుడు సిట్టింగులను మార్చి ముందుకెళ్తే వచ్చే ఫలితాలలో కూడా మార్పు రాకుంటే రాష్ట్రంలో బిఆర్ఎస్ పరిస్థితి మునపటి కాంగ్రెస్ లెక్క మారడం ఖాయంగా కనపడుతుంది. ఉద్యమ పార్టీగా మొదలయ్యి ఉద్యమ నాయకులను పక్కన పెట్టి పక్క పార్టీ నేతలతో కారుని ఓవర్ లోడ్ చేసిన కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఇదే తరహా తీర్పిని అంగీకరించ వలసివస్తే ఓవర్ లోడ్ గా ఉన్న కారు కాస్త ఐదేళ్లు గడిచే సరికి ఏ పరిస్థితిలో ఉంటుందో ఊహించలేము అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.




