తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ఎప్పటిలాగే సిఎం కేసీఆర్ ముందుగా అభ్యర్ధులను ప్రకటించి శంఖారావం పూరించారు. తొలిజాబితాలో 80-90 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తారనుకొంటే అందరి అంచనాలను తారుమారు చేస్తూ తొలిజాబితాలోనే మొత్తం 119 స్థానాలలో 115 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించారు. ఏడు నియోజకవర్గాలలో తప్ప సిట్టింగ్ ఎమ్మెల్యేలు తప్ప మిగిలినవారందరికీ మళ్ళీ అవకాశం కల్పించారు.
ఈసారి టికెట్లు ఖరారు అయిన వారిలో దాదాపు అందరూ పాతవారే. వారిలో అత్యధికంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు 40 మంది ఉండగా, కేసీఆర్ వెలమ సామాజిక వర్గానికి చెందినవారు 11 మంది, కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు 5 మంది ఉన్నారు. బ్రాహ్మణ, వైశ్య వర్గాలకు చెరో సీటు ఇచ్చి మిగిలిన 61 సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించారు.
చట్టసభలలో మహిళలకు 35 శాతం సీట్లు కేటాయించాలని కోరుతూ కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఢిల్లీలో ధర్నాలు చేశారు. కానీ ఈసారి కూడా కేసీఆర్ తన పార్టీలో కేవలం 5 స్థానాలే మహిళలకు కేటాయించారు. వాటిలో కల్వకుంట్ల కవిత ఉంటారనుకొంటే ఆమె పేరు లేదు! దాదాపు అభ్యర్ధులందరినీ ఖరారు చేసేశారు కనుక ఆమెకు ఈసారి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లేన్నట్లే భావించవచ్చు.
కనుక ఈసారి ఆమె చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని ధర్నాలు చేసే ముందు తన తండ్రి అధికార నివాసం ప్రగతి భవన్ ఎదుటే ధర్నా చేయమని కాంగ్రెస్, బిజెపిలు తప్పక చెపుతాయి.
ఇంకా జనగామ, నాంపల్లి, ఘోషామహల్, నర్సాపూర్ నాలుగు నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్ధులను ప్రకటించవలసి ఉంది. ఒకేసారి దాదాపు అభ్యర్ధులందరినీ ప్రకటించడం ద్వారా సిఎం కేసీఆర్ తన మంత్రులు, ఎమ్మెల్యేలపై గల నమ్మకాన్ని, అలాగే వారితోనే మళ్ళీ కలిసి పోటీ చేసి తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వస్తామనే గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేసిన్నట్లు భావించవచ్చు. ఈసారి 119కి 100 సీట్లకు పైగా గెలుచుకొంటామని ఖచ్చితంగా చెపుతున్నారు.
కేసీఆర్ ఈసారి కామారెడ్డి, గజ్వేల్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నారు. ఆయన సొంత నియోజకవర్గం గజ్వేల్లో ఆయనకు తిరుగులేనప్పటికీ ఈసారి కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయాలనుకోవడం కాస్త ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయనకు ఓటమి భయం పట్టుకొందని అందుకే రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారని విమర్శించేందుకు ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చిన్నట్లయింది.



